టీఆర్ఎస్లోనే ఉంటామన్న కమలాపూర్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ
కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని మండల ప్రజాప్రతినిధులు స్పష్టం
మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లితో భేటీ
పేదల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో ఈటల నుంచి మంత్రి పదవి తీసేస్తే దాన్ని సానుభూతిగా మార్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈటల రాజేందర్కు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా సొంత ఊరైన కమలాపూర్లోనూ ఎవరి నుంచీ మద్దతు దక్కడంలేదు. తన కులబాంధవులంతా తన వెంటే ఉంటారని భావించిన ఈటలకు దినదినం ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నయి. ఈటలతో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కలువబోమని, టీఆర్ఎస్లోనే కొనసాగుతామని కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ నేతలను అణగదొక్కడమే తప్ప ఈటల ఎవరికీ గుర్తింపు ఇచ్చింది లేదని అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయాలతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందిందని, పుష్కలంగా సాగునీరు వస్తోందని స్పష్టం చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి రాజకీయంగానూ ఈటల అవకాశాలు ఇవ్వలేదని, తనకు దగ్గర ఉండే వారికే ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు. ఈటల సొంత మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, ఉప సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, ఇతర నేతలంతా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈటల స్వగ్రామం కమలాపూర్లో మూడు ఎంపీటీసీ స్థానాలుంటే గత ఎన్నికల్లో ఒక స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకుంది. ఈటల సమీప బంధువు, వరుసకు సోదరుడైన మౌటం అశోక్ భార్య శైలజ ఎంపీటీసీగా గెలిచారు. ఈమెకు వైస్ ఎంపీపీగా అవకాశం వచ్చింది. అశోక్ సైతం టీఆర్ఎస్లోనే కొనసాగుతానని శనివారం స్పష్టం చేశారు. ఈటల తరహాలో తాము సొంత పార్టీకి ద్రోహం చేయబోమన్నారు. 2001 నుంచి టీఆర్ఎస్లో ఉంటున్న అశోక్ సొంత పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. మరోవైపు కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ పేరాల సంపత్రావు, కేడీసీసీబీ డైరెక్టర్ పీ కృష్ణప్రసాద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నేత కుమారస్వామి తదితరులు టీఆర్ఎస్తోనే తమ రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్లను హైదరాబాద్లో కలిశారు. కమలాపూర్ మండలంలోని మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీలు సైతం ఇదే దారిలో ప్రయాణిస్తామని చెప్పారు. ఈటల టీఆర్ఎస్కు ద్రోహం చేశారని, తాము అలా చేయబోమని పార్టీలోనే కొనసాగుతామని రెండు రోజుల క్రితం సర్పంచులు సైతం ప్రకటించారు. అంతకుముందు ఎంపీటీసీలు, పీఏసీఎస్ల డైరెక్టర్లు ఇదే తరహాలో తమ నిర్ణయాన్ని వెలిబుచ్చారు.
హైదరాబాద్లో భేటీ
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలాపుర్ మండల ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్లో మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. కమలాపుర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, పీఏసీసీఎస్ చైర్మన్ పేరాల సంపత్రావు, కేడీసీసీబీ డైరెక్టర్ పీ కృష్ణప్రసాద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి తదితరులు భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కమలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆలోచనలకు తావు లేదని, తామంతా టీఆర్ఎస్లోనే ఉన్నామని కుండబద్దలు కొట్టారు.