ఏడాదిలోగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
కొవిడ్ బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
వరంగల్ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
సర్కారు దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది
ఆక్సిజన్, రెమ్డెసివిర్, మందులకు కొరత లేదు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మే 22 : రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ను హెల్త్హబ్గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందులో భాగంగా సెంట్రల్ జైల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎంజీఎం హాస్పిటల్ను మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలని సీఎం ఆదేశించారని తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా తీసుకొన్న నిర్ణయాలపై శనివారం హన్మకొండలోని హరిత హోటల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి గానీ, కేంద్ర మంత్రులు గాని కొవిడ్ వార్డులోకి వెళ్లలేదని, సీఎం కేసీఆర్ మాత్రం నేరుగా ఎంజీఎంలోని కొవిడ్ వార్డుకు వెళ్లి స్వయంగా పేషెంట్లతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారని చెప్పారు. అంతేగాక అక్కడ అందుతున్న వైద్యం, భోజనం, ఇతర వివరాలను అడిగి రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఆక్సిజన్, మందుల సరఫరాపై ఎప్పటికపుడు డాక్టర్లు, వైద్యాధికారులతో సమీక్షించి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. ఎంజీఎంలో బెడ్స్ కొరత ఉన్నట్లు తెలియగానే వెంటనే 150 బెడ్స్ తెప్పించామని తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజారోగ్యం మరింత బలోపేతమైందన్నారు. ఆక్సిజన్, మందుల కొరత లేదని, ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగిందని అందుకే చికిత్స కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు మేరకు అవసరమైన సిబ్బందిని నియమించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. టెక్నికల్ సిబ్బంది కొరత ఉందని, అవసరమైతే ఎక్కువ వేతనం ఇచ్చి నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేశారని గుర్తుచేశారు. కొవిడ్ బాధితులను ఆదుకొనేందుకు దాతలతో పాటు సంస్థలకు అభినందనలు తెలిపారు.
ఏడాదిలోగా సూపర్ స్పెషాలిటీ
హాస్పిటల్ నిర్మాణం
సీఎం ఆదేశాల మేరకు ఎంజీఎంను సెంట్రల్ జైల్ ఆవరణలోకి తరలించి సంవత్సరంలోగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని ఈమేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రస్తుతం జైలు వెనుక భాగాన ఉన్న 23 ఎకరాల ఖాళీ స్థలంలో హాస్పిటల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, సరిహద్దు రాష్ర్టాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం గతంలో విజ్ఞప్తి చేసినప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల పక్షానా మంత్రి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు కరోనా బారిన పడకుండా ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన పడొద్దని లేదని మంత్రి సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు లాక్డౌన్ అమలు చేస్తున్నామని, అందరూ ఇంట్లోనే ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుందర్రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.