గిర్మాజీపేట, మే 23: జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. మొత్తం 9,940 మంది విద్యార్థులకు 9,882 మంది పరీక్ష రాయగా, 58 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. 99.4 హాజరు శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని 56 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 22 పరీక్ష కేంద్రాలను అధికారుల బృందాలు తనిఖీ చేశాయి. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట(రెవెన్యూ) కృష్ణాకాలనీలోని ప్రభుత్వ పాఠశాల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్ శంభునిపేటలోని ప్రభుత్వ పాఠశాల, వరంగల్లోని కీస్ హైస్కూల్, తెలంగాణ శ్రీచైతన్య స్కూల్, ప్లాటినం జూబ్లీ హైస్కూల్తోపాటు నెక్కొండ మండలంలోని మోడల్ స్కూల్, మాంటిస్సోరి హైస్కూల్, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసినట్లు డీఈవో వివరించారు. 14 పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశారని తెలిపారు.
ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి
కరీమాబాద్: పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సెంటర్ నిర్వాహకులు చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. శంభునిపేటలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తరగతి గదితోపాటు పాఠశాల ఆవరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు.
తాగునీరు అందుబాటులో ఉండాలి: డీఈవో
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండాలని డీఈవో వాసంతి నిర్వాహకులకు సూచించారు. నెక్కొండలోని జడ్పీహెచ్ఎస్, ఆదర్శపాఠశాల, మాంటిస్సోరి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని కోరారు. కాగా, నెక్కొండలోని మూడు సెంటర్లలో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మోడల్ స్కూల్ సెంటర్లో ఐదుగురు, మాంటిస్సోరి హైస్కూల్లో ఇద్దరు గైర్హాజరైనట్లు సీఎస్ ఎస్ మోహన్రావు తెలిపారు.
నర్సంపేటలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. పట్టణంలోని బాలుర, బాలికల, మోడల్ స్కూల్, డపోడిల్స్, విస్డమ్, సోషల్ వెల్ఫేర్ సెంటర్లలో పరీక్షలు జరిగాయి. నర్సంపేటలోని సెంటర్లలో ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఖానాపురం మండలంలోని ఖానాపురం జడ్పీహెచ్ఎస్, బుధరావుపేట మోడల్స్కూల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఖానాపురం స్కూల్లో వంద శాతం హాజరు నమోదు కాగా, బుధరావుపేట మోడల్స్కూల్లో 169 మందికి ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఖానాపురం పరీక్ష కేంద్రాన్ని తాసిల్దార్ జులూరి సుభాషిణి తనిఖీ చేశారు.
సౌకర్యాలను పరిశీలించిన అధికారులు
చెన్నారావుపేట మండలం అమీనాబాద్ మోడల్ స్కూల్, చెన్నారావుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో టెన్త్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు సెంటర్లను ఎంపీడీవో దయాకర్, తాసిల్దార్ బన్సీలాల్ పర్యవేక్షించి సౌకర్యాలు తెలుసుకున్నారు. మోడల్ స్కూల్లో వంద శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ తెలిపారు. చెన్నారావుపేట పరీక్ష కేంద్రంలో 170 మంది విద్యార్థులకు ఒకరు గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెంకట్రాంనర్సయ్య తెలిపారు. గీసుగొండ మండలంలోని మరియపురం సెయింట్ జాన్ హైస్కూల్లో 170, గీసుగొండ జడ్పీహెచ్ఎస్లో 250 మందికి 248 మంది, ధర్మారం జడ్పీహెచ్ఎస్లో 260 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఇన్చార్జి ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. మండలంలో ఇద్దరు మాత్రమే గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నల్లబెల్లి మండలకేంద్రంలోని పీఎస్లో 82 మందికి ఒకరు గైర్హాజరయ్యారు. జడ్పీహెచ్ఎస్లో 140 మంది, రుద్రగూడెం జడ్పీహెచ్ఎస్లో 150 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 372 మందికి 371 మంది విద్యార్థులు మొదటి రోజు తెలుగు పరీక్ష రాశారు. ఎస్సై రాజారాం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
మొదటి రోజు ప్రశాంతం..
మొదటి రోజు పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. సంగెం పరీక్ష కేంద్రంలో 166 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో విజయ్కుమార్ తెలిపారు. గవిచర్ల మోడల్స్కూల్లో 220 మందికి అందరూ హాజరైనట్లు చెప్పారు. రెండు పరీక్ష కేంద్రాల వద్ద సంగెం ఎస్సై కిరణ్మయి 144 సెక్షన్ విధించారు. రాయపర్తి మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 39 గ్రామాల పరిధిలోని 12 జడ్పీహెచ్ఎస్లు, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, కేజీబీవీ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారు. రాయపర్తిలోని జడ్పీహెచ్ఎస్లో 280 మందికి ఐదుగురు గైర్హాజరయ్యారు. సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 219 మందికి 216 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఎంఈవో నోముల రంగయ్య తెలిపారు. రాయపర్తిలో సర్పంచ్ గారె నర్సయ్య తన సొంత ఖర్చులతో పిల్లలకు తాగునీరు సౌకర్యం కల్పించారు. సెంటర్ల వద్ద ఎస్సై బండారి రాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.