వరంగల్, మే 29 : వరంగల్ నగరంలో సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేసే కార్యక్రమానికి తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది. కార్పొరేషన్ పరిధిలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలని బల్దియా అధికారయంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఐదుచోట్ల సెంటర్లు పెట్టి శనివారం 3,378 మందికి టీకాలు వేశారు. శంభునిపేటలోని ఆర్ఆర్ గార్డెన్, వరంగల్లోని ఇన్నర్వీల్ క్లబ్, హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్, మడికొండలోని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, భీమారంలోని జీఎంఆర్ గార్డెన్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్కు పర్యవేక్షణాధికారులను నియమించారు. పర్యవేక్షణ బాధ్యతలను చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డికి కమిషనర్ పమేలా సత్పతి అప్పగించారు. బల్దియా, జిల్లా వైద్యశాఖ అధికారులు సమన్వయంతో సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 20 రోజుల పాటు ప్రత్యేక సెంటర్ల ద్వారా లక్ష మందికి టీకాలు వేసేలా ప్రణాళికలు రూపొదించారు. రోజూ 5వేల మందికి టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సిన్ సెంటర్లలో బల్దియా ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్లో 10 టేబుల్స్ ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. ఇన్నర్విల్ క్లబ్ సెంటర్లో 641మంది, మడికొండ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ సెంటర్లో 636, భీమారం జీఎంఆర్ గార్డెన్లో 713, విష్ణుప్రియా గార్డెన్లో 885, ఆర్ఆర్ గార్డెన్లో 503 మందికి టీకాలు వేశారు. తొలి రోజు కార్యక్రమాన్ని బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు శ్రీనివాసరావు, ప్రవీణ్కుమార్, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్యాదవ్ పర్యవేక్షించారు.