వరంగల్రూరల్, మే 29 (నమస్తే తెలంగాణ) :కరోనాపై పోరులో ఆశ కార్యకర్తలు ముందువరుసలో ఉన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితులకు సేవలందిస్తూ వివిధ స్థాయిల్లో ఎవరికివారే నిర్విరామంగా శ్రమిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కరోనా రెస్పాన్స్ టీముల్లో వీరు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందాలు కొవిడ్ బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ద్వారా సత్ఫలితాలు వస్తుండడంలో ఆశ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సర్వే బృందాల్లో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉంటున్నా ఆశ వర్కర్లు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సర్వేలో గుర్తించిన కొవిడ్ బాధితులకు ఔషధ కిట్లు అందజేయడం నుంచి వారు కోలుకునే వరకూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఆశ వర్కర్లకు బాధ్యతలు
కరోనా కట్టడికి ప్రభుత్వం తొలి విడుత ఈ నెల 6 నుంచి 9వరకు ఇంటింటా జ్వర సర్వే నిర్వహించింది. ఇప్పుడు రెండో విడుత సర్వే కూడా చేస్తున్నది. పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, బిల్కలెక్టర్లు, మెప్మా రిసోర్స్పర్సన్లు, వీఆర్వోలు, వీఆర్ఏలతో కూడిన బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఇంటింటికీ వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర ఆరోగ్య సమస్యలున్న వారి వివరాలు సేకరించి నివేదికలు తయారు చేసి వైద్య ఆరోగ్యశాఖకు అందజేస్తున్నాయి. ఈ మేరకు వైద్య అధికారులు సర్వేలో గుర్తించిన కరోనా బాధితులకు ఆశ వర్కర్ల ద్వారా మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.
వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తొలి విడుత జ్వర సర్వే అనుభవాలను విశ్లేషించి రెండో విడుత ఇంటింటా సర్వేకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. గ్రామాలు, పట్టణాల్లో సర్వే జరిపే ప్రతి టీంలో ఒక ఆశ వర్కర్ కచ్చితంగా ఉండేలా జ్వర సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. రెండో విడత సర్వేకు వెళ్లినప్పుడే ఆశ వర్కర్లు ప్రభుత్వం సరఫరా చేసిన మెడికల్ కిట్లను వెంట తీసుకెళ్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి సర్వే సమయంలోనే వాటిని అందజేస్తున్నారు. తర్వాత బాధితులకు అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఫోన్ ద్వారా లేదా నేరుగా బాధితులతో మాట్లాడి ఔషధ కిట్ల వాడకం, ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఏఎన్ఎంలతో పాటు వైద్య ఆరోగ్యశాఖలోని ఇతర ఉద్యోగులు, సిబ్బంది కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ విధుల్లో బిజీగా ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఆశ వర్కర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలందించే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
శక్తివంచన లేకుండా పనిచేస్తున్నం..
పల్లెల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు భయపడుతున్నరు. హోం ఐసొ లేషన్లో ఉంటున్న బాధితులైతే తీవ్ర మనోవేదన చెందుతున్నరు. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. జ్వర సర్వే కోసం, ఆరోగ్య సమస్యలు తెలుసుకునేందుకు, మందులు ఇచ్చేందుకు మేము ఇండ్లకు వెళ్లినప్పుడు వైరస్ బాధితులు వారి బాధలను మాతో పంచుకుంటు న్న రు. అనారోగ్యంతో ఉన్నోళ్లకు వెంటనే మందులు ఇస్తున్నం. మమ్మల్ని చూడగా నే గుండెల్లో బరువు దిగినట్లనిపిస్తున్నదని ప్రజలు చెబుతున్నరు. ఉన్నతాధికా రుల ఆదేశాలతో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నం. ప్రజల ప్రాణాలు కాపాడే యజ్ఞంలో భాగస్వాము లమవుతున్నం. – కంచర్ల సువర్ణ, ఆశ వర్కర్, ఇల్లంద
ప్రజలకు ధైర్యం చెప్తున్నం..
ప్రభుత్వ ఆదేశాలతో స్వయంగా ప్రజల వద్దకు వెళ్తున్నం. క్షేత్రస్థాయిలో వైరస్ వ్యాప్తిని తెలుసుకుంటున్నం. జ్వర సర్వే ద్వారా అనారోగ్యంతో ఉన్నోళ్లను గుర్తించి వారికి మెడికల్ కిట్లు ఇస్తున్నం. కోలుకునేదాక వారి బాగోగులు చూసుకుంటున్నం. ఇంటింటికి వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలున్న వారి వివరాలు సేకరిస్తున్నం. వెంటనే వారికి మెడికల్ కిట్లు ఇస్తున్నం. కరోనా వల్ల గ్రామీణ వైద్యులు కూడా వైద్య సేవలు నిలిపివేయడంతో జలుబు చేసినా జనం భయపడుతున్నరు. మేము వారి మధ్య తిరుగుతున్నప్పుడు మమ్ములను సొంత మనుషుల్లెక్క చూసుకుంటున్నారు. వాళ్ల ఇబ్బందులు చెబుతున్నారు. మేము వారికి ధైర్యం చెబుతూ సేవలు అందిస్తున్నం.
-పెందోట నాగమణి,ఆశ వర్కర్, మొరిపిరాల