వర్ధన్నపేట/పర్వతగిరి, మే 29 : కరోనా వ్యాక్సిన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. శనివారం ఆయన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ హరితతో కలిసి వర్ధన్నపేట సీహెచ్సీలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రారంభించారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్తో కలిసి సందర్శించారు వైద్యసేవలపై స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కరోనా టెస్టులు, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మం త్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమైందన్నారు. రాష్ర్టానికి కేవలం 10 లక్షల డోస్లు మాత్రమే ఇచ్చిందని, అయి నా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరో నా తగ్గుముఖం పట్టిందన్నారు. వచ్చే డిసెంబర్ వరకు పూర్తిస్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇల్లందలో పీహెచ్సీ ఏర్పాటుకు ఎమ్మెల్యే రమేశ్ ఎంతగానో కృషి చేశారని, అది సమర్థవంతంగా నడిచేలా సహకారం అందిస్తానని అన్నారు. కరోనా ఉధృతి తగ్గుతున్నదని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పా టించాలన్నారు. అత్యవసరమైతేనే మాస్కుధరించి బయటకు రావాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని అప్పులు తెచ్చి మరీ కొంటున్నదన్నారు. ఈ కార్యక్రమాల్లో వర్ధన్నపేటలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, డీఎంహెచ్వో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు కుమారస్వామి, కౌన్సిలర్లు, రాయపర్తిలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, డాక్టర్ వెంకటేశ్, ఎంపీడీవో రామ్మోహనాచారి, పర్వతగిరిలో పీహెచ్సీ డాక్టర్ ప్రసాద్, జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీటీసీ రాజు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సోమేశ్వర్రావు, సర్పంచ్ మాలతి పాల్గొన్నారు.
వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలి
పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దయాకర్రావు ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్వాహకుల ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి మండలానికో అధికారిని నియమించినట్లు చెప్పారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందిపెట్టొద్దని నిర్వాహకులకు సూచించారు తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని, రైతులు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. రైతు కష్టాలు తెలిసిన నాయకుడు రాష్ర్టానికి సీఎంగా ఉండడం మన అదృష్టమన్నారు.