హన్మకొండ చౌరస్తా, మే 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా అర్చకుల సమస్యలు, అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుల నియామకం గురించి వివరించారు. 577 జీవో ప్రకారం కరోనా సమయంలో కూడా వేతనాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 21 కులాల అర్చక వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారని ఉపేంద్రశర్మ తెలిపారు. విద్యుత్ శాఖ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్, టీఆర్ఎస్ నాయకుడు పులి రజినీకాంత్ ఉన్నారు.