వరంగల్ చౌరస్తా, మే 20 : కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్క రూ తప్పని సరిగా పాటించాలని వరంగల్ అర్బన్ డీఎంహెచ్వో లలితా దేవి సూచించారు. గురువారం కరోనా వైద్యసేవలందిస్తున్న పలు ప్రైవేట్ దవాఖానలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ కమిటీ బృందం తనిఖీలు నిర్వహించారు. గురువారం డీఎంహెచ్వో లలితా దేవి, జిల్లా పం చాయతీరాజ్శాఖ అధికారి జగదీశ్వర్ప్రసాద్, అడిషనల్ డీఎంహెచ్వో మధన్మోహన్రావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ రఫీ షేక్ లతో కూడిన కమిటీ నగరంలోని ఆధ్యకిడ్స్, సిగ్మా, రాజయ్య మెమోరియల్, సెవెన్ హిల్స్, శ్రీనివాస పినాకిల్, రాజు ఈఎన్టీ దవాఖానలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్యసేవలను వారి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైద్యానికి వినియోగిస్తున్న మందులు, ఇతర మౌలిక వసతులు, ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం, తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి బా ధితుల నుంచి బిల్లులు తీసుకోవాలన్నారు. బాధితుడి పూర్తి వివరాలతో పాటు, అం దిస్తున్న వైద్యసేవలు, బాధితుడి ఇచ్చిన ఔషధాల వివరాలు రికార్డులో నమోదు చేయాలని ఆదేశించారు. వీరితో పాటుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్లు డిప్యూటీ డీఎంహెచ్వో యాకూబ్పాషా, డీటీసీవో మల్లికార్జున్, ప్రసన్న కుమార్ నగరంలో వారి పరిధిలోని పలు కరోనా వైద్యసేవలందిస్తున్న దవాఖానలను తనిఖీ చేశారు.