రోజూ పదివేల మందికి అన్నదానం
చీఫ్విప్ వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి
కాజీపేటలో ఉచిత భోజన కేంద్రం ప్రారంభం
కాజీపేట, మే 19 : కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది, వలస కూలీలు, అనాథలు, జ్వర సర్వే చేస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇబ్బందిపడకుండా కార్పొరేషన్ పరిధిలో తొమ్మిది ఉచిత భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బుధవారం వారు కాజీపేట చౌరస్తాలోని అన్నపూర్ణ క్యాంటీన్లో ఉచిత భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నదన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచిందన్నారు.
ప్రైవేటు దవాఖానలు అధిక బిల్లులు వసూలు చేయకుండా టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి నిత్యం పర్య వేక్షిస్తున్నట్లు చెప్పారు. నగరంలో పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉచిత భోజన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ.. కాజీపేట, కలెక్టరేట్, మెటర్నిటీ దవాఖాన, అదాలత్, ఎంజీఎం, సీకేఎం దవాఖాన, అండర్బ్రిడ్జి, వరంగల్ రైల్వేస్టేషన్, ఎనుమాముల ప్రాంతాల్లో ప్రారంభించిన కేంద్రాల్లో రోజూ 10వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ సత్యనా రాయణ, డీఈ నరేందర్, 47, 62, 63 డివిజన్ల కార్పొటర్లు సంకు నర్సింగారావు, జక్కుల రవీందర్, విజయశ్రీరజాలీ, మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఇన్స్పెక్టర్లు గోనెల రవీందర్, కరుణాకర్, యాదయ్య, ఏఈ వెంకటేశ్వర్లు, జవాన్లు పాల్గొన్నారు.