సమర్థవంతంగా లాక్డౌన్ అమలు
సడలింపు సమయంలో అనవసర షాపులు తెరువొద్దు
కొవిడ్ బాధితుల కోసం 250 బెడ్లు సిద్ధం
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
మహబూబాబాద్, మే 19: జిల్లాలో లాక్డౌన్ అమలుకు పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలో లాక్డౌన్ అమలు, పోలీసుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందన్నారు. జిల్లా పరిధిలో 11 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలు బయటకు రాకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కూరగాయల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉన్నందున వార్డుల వారీగా మార్కెట్లు ఏర్పాటు చేయించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి సూచించారు. లాక్డౌన్ సడలింపు సమయంలో కిరాణం, అత్యవసర, నిత్యావసర షాపులు మినహా ఇతర షాపులు తెరువకుండా దృష్టి సారించాలన్నారు. బుక్స్టాళ్లు, ఫర్నిచర్, బేకరీలు, స్వీట్హౌస్లు, ఫ్లైవుడ్, సెల్ఫోన్ షాపులతో ప్రజలకు అంతగా అవసరముండదని, అవి తెరువకుంటే కొంతవరకు కరోనాను కట్టడి చేయొచ్చన్నారు. ప్రభుత్వం రెండో విడుత లాక్డౌన్ను ప్రకటించిందని, ప్రజలు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడి కరోనాను నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో వైద్యసిబ్బంది జ్వర బాధితులను గుర్తించి మందులు ఇవ్వాలని, అత్యవసర చికిత్స అవసమైన వారిని ప్రభుత్వ దవాఖానలకు తరలించాలన్నారు. వీరి కోసమే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 250 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. పోలీస్, రెవెన్యూ, వైద్యాధికారుల సమన్వయంతో కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గౌతమ్ సహకారంతో రహదారులపై తోపుడు బండ్ల వ్యాపారులను ఒక్కచోటకు చేర్చి వారి ఉపాధికి ఇబ్బందికలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన మంత్రికి వివరించారు. ప్రజలు అవసరమైతేనే రోడ్లపైకి రావాలని, అత్యుత్సాహం ప్రదర్శించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం, ఎస్సైలు శంకర్రావు, వెంకన్న, అరుణ్కుమార్, ఫణిందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.