కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంత్రి సత్యవతి రాథోడ్
మానుకోటలో టీ డయాగ్నొస్టిక్ హబ్, గార్లలో 20 ఆక్సిజన్ బెడ్లు ప్రారంభం
మహబూబాబాద్/గార్ల, మే 17: ఇక నుంచి జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ఆమె జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్తో కలిసి జిల్లా ఆస్పత్రిలో ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి గార్ల మండలంలో నూతనంగా నిర్మించిన 30 పడకల దవాఖానలోని పై అంతస్తులో కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 20 ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానలకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రక్త, మూత్ర పరీక్ష యంత్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. మహబూబాబాద్ ఆస్పత్రిలో రూ.2.7కోట్లతో 57 రకాల వైద్యపరీక్షలు నిర్వహించేందుకు టీ డయాగ్నొస్టిక్ హబ్ను ప్రారంభించినట్లు చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లేనన్ని సౌకర్యాలు ప్రభుత్వ ఆస్పత్రు ల్లో ఉన్నాయన్నారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ కొవిడ్ రోగులకు అత్యవసర మందులు, ఆక్సిజన్ సక్రమంగా అందేలా నిత్యం పర్యవేక్షిస్తున్నదన్నారు.
కరోనా మహమ్మారిపై ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరారు. లాక్డౌన్తో ప్రజలు కొంతఇబ్బంది పడ్డప్పటికీ కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నదన్నారు. రాష్ట్రంలో నూతన దవాఖానల నిర్మాణం వేగంగా పూర్తవుతున్నదని, ఇప్పటికే కొన్ని దవాఖానల్లో కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. గార్లలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ.. ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీచైర్పర్సన్ బిందు, కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మహబూబాబాద్ మునిసిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, గార్ల సర్పంచ్ బన్సీలాల్ నాయక్, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు వెంకట్రాములు, కౌన్సిలర్ గంగాధర్, వడ్డేబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.