కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ప్రజలు
వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం ఇచ్చిందేమీ లేదు
టీఆర్ఎస్ సర్కారుతోనే నగరానికి కొత్తరూపు
బీజేపీ నాయకులు పిచ్చి కూతలు మానుకోవాలి
ఇక్కడి ప్రజల చిరకాల కోరిక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ
కేంద్రం మెడలు వంచైనా ఫ్యాక్టరీని సాధిస్తాం
మెడికల్ కళాశాలలు తెచ్చుకోలేని దద్దమ్మలు బీజేపీ నేతలు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, ఏప్రిల్ 17 : ‘గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్సైడ్ కానుంది. టీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని’ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హన్మకొండ రాంనగర్లోని షైన్ స్కూల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి శనివారం ఆయ న విలేకర్ల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యం లో వరంగల్ పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోందన్నారు. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్త్తోందన్నారు. తప్పుడు మాటలు మాట్లాడే వారికి వరంగల్ పట్టణ ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో బీజేపీని ఓడిస్తున్నప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గు చేట న్నారు.
టీఆర్ఎస్ రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలిచినా బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ సత్తా ఏంటో తెలియడం లేదని అన్నారు. వరంగల్ నగరంలో ప్రతి రోజు తాగు నీరు అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా రూ.9057 ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. వరంగల్లో వరదలు వచ్చినపు డు కేంద్రం ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. స్టేట్మెంట్లు ఇవ్వడం మాని నగరాభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. మెడికల్ కళాశాలలు తెచ్చుకోని మీకు మాట్లాడే అర్హత లేదన్నారు. కరీంనగర్లో అభివృద్ధి చేయలేని సంజయ్ వరంగల్లో చేస్తాడంటే నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరన్నారు. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా కోచ్ ప్యాక్టరీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ..బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రాజ్యంగం ప్రకారం మాకు రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కడియం, తాను ఎంపీగా ఉన్నపుడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కాజీపేట కోచ్ ప్యాక్టరీ మా హక్కు, మా హక్కును, ప్రజలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ సాధిస్తామని అన్నా రు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ..హైదరాబాద్ తర్వాత రెండో పెద్దనగరమైన వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఇటీవల రూ.2700 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పిచ్చి పిచ్చి మాటలు, మత తత్వ విద్వేశాలతో రెచ్చగొట్టే బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ నెల 30న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడి యం శ్రీహరి, బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ‘కుడా’ చైర్మన్ యాదవరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పాల్గొన్నారు.