వరంగల్ చౌరస్తా, మార్చి 16: ఎంజీఎం దవాఖాన త్వర లో సంతానం లేని దంపతుల బాధలను తీర్చడానికి సిద్ధమవుతున్నది. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్యం అందించడానికి ఎంజీఎం హాస్పిటల్లో సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు అధికారులు చర్యలు సైతం ప్రారంభించారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ఎంసీహెచ్ బ్లాకులోని రెండవ అంతస్తులో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు కార్యాచరణ చేపట్టారు. సుమారు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు ఏడాది క్రితం ముందు కువచ్చిన ప్రతిపాదనను కరోనా కారణంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టనున్న భవనం లో ప్రస్తుతం కొవిడ్19 వార్డుగా వినియోగిస్తున్నందున రానున్న వారం రోజుల్లో దీన్ని ప్రస్తుతం ట్రయాజ్ వార్డుగా వినియోగిస్తున్న భవనంలోకి మార్చి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా వార్డును తరలింపు పూర్తికాగానే నిర్మాణ పనులు పూర్తి చేసి ఏప్రిల్లో సేవలు ప్రారంభించనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు.