ఉమ్మడి జిల్లాలో ఐదో రోజూ కట్టుదిట్టంగా
ఆదివారం ఉదయం సందడిగా మార్కెట్లు
నిబంధనలు పాటించని వారికి జరిమానా
స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలు
నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ లాక్డౌన్ విజయవంతమైంది. ఆదివారం కావడంతో ఎక్కడచూసినా మార్కెట్లన్నీ ఉదయం బిజీబిజీగా కనిపించాయి. ఉదయం 6 నుంచి చికెన్, మటన్, చేపలతో పాటు నిత్యావసర వస్తువులు కొనేందుకు వచ్చి వెళ్లడంతో రోడ్లన్నీ ఫుల్ రష్గా మారాయి. అందులో లాక్డౌన్ 10 గంటలకు వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూసేయడంతో ఒక్కసారిగా రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. కేటాయించిన సమయం ముగిసిన క్షణం నుంచి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులు, వీధులు, కూడళ్ల వద్ద పోలీసుల పహారా కాశారు. అత్యవసర సేవల కోసం వెళ్లే వారిని అనుమతించి, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి జరిమానా వేశారు.