రోగుల వద్ద ఎక్కువ వసూలు చేస్తే చర్యలు
రూ.2 వేలకు సీటీ స్కాన్
మంత్రి దయాకర్రావు
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల సమీక్ష
వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు వైద్యం అందించే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు సహేతుకంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కష్టకాలంలో పెద్ద మనసుతో వ్యవహరించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ను ప్రభు త్వం పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నదన్నారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా కట్టడి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలపై వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా అధికారులు, ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు, బిల్లుల వసూళ్లపై పర్యవేక్షణ కోసం జిల్లా వైద్యాధికారి, ఆర్డీవో, డిప్యూటీ పోలీస్ కమిషనర్, డ్రగ్ ఇన్స్పెపెక్టర్, జిల్లా పంచాయతీ అధికారితో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. అధిక బిల్లుల నియంత్రణతోపా టు ప్రైవేటులో రోగులకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఈ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటళ్లకు 1650 రెమ్డెసివిర్, 55 టన్నుల ఆక్సిజన్ను ప్రతిరోజు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్, వరంగల్ పోలీ స్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. సీటీ స్కాన్ సేవలు రూ.2 వేలకు అందించేలా ప్రైవేటు సంస్థలు అంగీకరించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఎంజీఎంలో మెరుగైన సేవలు
కరోనా బాధితులకు ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పా రు. అదనంగా సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కరో నా వార్డులో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనితీరును బట్టి రానున్న రోజుల్లో వారిని పర్మినెంట్ చేసే అవకాశం ఉందన్నారు. ఎంజీఎంలో మరో 150 వార్డులకు వారం రోజుల్లో ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలున్న వారు కరోనా పరీక్ష అవసరం లేకుండానే మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేతో కరోనా వ్యాప్తిని నియంత్రించడం సులువవుతోందని తెలిపారు. జ్వర సర్వే, లాక్డౌన్తో మంచి ఫలితాలు ఉన్నాయన్నారు.
హైదరాబాద్ తర్వా త వరంగల్లోని దవాఖానల్లోనే ఎక్కువ మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నట్లు తెలిపారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఎం జీఎం ఆస్పత్రికి 50 ఆక్సిజన్ కాన్సంట్రెటర్లు, బైప్యాక్ మిషన్లు మంత్రి ద్వారా అందజేశారు. కష్టకాలంలో ప్రైవేటు హాస్పిటళ్లు సేవా భావంతో పని చేసి సహకరించాలని ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు బండా ప్రకాశ్, ద యాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, రూరల్ కలెక్టర్ ఎం.హరిత, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి సమీక్షలో పాల్గొన్నారు.