కోల్కతా వేదికగా వరంగల్ కమిషనరేట్లో మోసాలు
మూడేళ్లలో రూ.రెండున్నర కోట్లు లూటీ
ముఠా గుట్టు రట్టు
13 మంది నిందితుల అరెస్టు
రూ.14.36 లక్షలు, 15 సెల్ఫోన్లు స్వాధీనం
వీరంతా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లావాసులు
వరంగల్ సీపీ తరుణ్జోషి వెల్లడి
హన్మకొండ సిటీ, ఏప్రిల్16 : కోల్కతా వేదికగా ఆన్లైన్ మోసాలకు పాల్పడి 2019 నుంచి ఇప్పటి వరకు మూడున్నర ఏళ్లలో రూ.రెండున్నర కోట్ల నగదు దోచుకున్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముఠా వరంగల్ కమిషనరేట్ పోలీసులకు చిక్కింది. గిఫ్ట్ల పేర ఆన్లైన్ వినియోగదారులను నమ్మించి డబ్బులను గుంజుతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని రూ.14.36 లక్షలు, 15 సెల్ఫోన్లు, స్క్రాచ్ కార్డులను సీజ్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ తరుణ్జోషీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ నగర్కు చెందిన ఇప్ప రాజ్కుమార్ ఆన్లైన్ షాపింగ్ చేయడం ద్వారా గిఫ్ట్లు వచ్చాయని ప్రజలను నమ్మించి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. దీనికి అంబేద్కర్నగర్కు చెందిన తాళ్లపెల్లి దామోదర్గౌడ్ సహాయం తీసుకొని పథకం రచించాడు. లోకల్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కోల్కతా వేదికగా చేసుకుని అక్కడ నివాసం ఉంటున్న ముగ్గురు (ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్)ను తన అనుచరులుగా చేసుకుని బెల్లంపల్లి, మంచిర్యాలకు చెందిన యువకులతో ముఠాగా తయారై మోసాలు చేయడం ప్రారంభించాడు. రెండు తెలుగులో రాష్ర్టాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసిన వినియోగదారుల ఫోన్ నంబర్లు సంపాదించి ఆన్లైన్ షాపింగ్ చేయడం ద్వారా గిఫ్ట్గా కారు గెలుచుకున్నారని ముఠాలోని సభ్యులు ఫోన్ చేసేవారు. దా నిని పొందాలంటే కొంత డబ్బు బ్యాంక్లో జమ చేయాలని తెలిపేవారు. వారు నమ్మేలా ఇంటి చిరునామాకు స్క్రాచ్ కార్డులను పోస్ట్ ద్వారా పంపించేవారు.
ఇలా ప్రతి రోజూ తప్పుడు అడ్రస్తో ఉన్న సెల్ నంబర్లతో వినియోగదారులను మోసం చేసేవారు. నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతేజార్గంజ్, స్టేషన్ఘన్పూర్, జఫర్గడ్, గీసుగొండ, ఖానాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులను మోసం చేయగా, ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్ మోసాలపై దృష్టిసారించి సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప పర్యవేక్షణలో ఆధునిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉద యం నిందితులు వరంగల్ నుంచి కోల్కతా వెళ్తున్నట్లు సమాచారం అందడంతో వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రధాన నిందితులు ఇప్ప రాజ్కుమార్, దామోదర్గౌడ్తో పాటు ముఠాలోని బెల్లంపల్లి అంబేద్కర్నగర్కు చెందిన దాసరి హరీశ్గౌడ్, పోరండ్ల విజయ్, వొల్లం ప్రవీణ్, గంగాధరి రాంచందర్, మందమర్రి మండలం చాకపల్లివాసి గంగాధర్ రాకేశ్, మందమర్రి మండలం గుడిపల్లివాసి మేకల ఆదిత్య, ఆకునూరి శ్రావణ్కుమార్, బెల్లంపల్లి మండలం పొన్నారం వాసి ఈద రవికుమార్, శంషీర్గనర్వాసి దార్న గణేశ్, మందమర్రి నుంచి ప్రస్తుతం హన్మకొండలో నివాసం ఉంటున్న సిరికొండ వినోద్కుమార్, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం సెంటినరీ కాలనీకి చెందిన ఆడెపు సిద్ధార్థ్ను ఆదుపులోకి తీసుకున్నారు. కోల్కతా చెందిన ముగ్గురు నిందితులతో పాటు ముఠాలోని బెల్లంపల్లి, మంచిర్యాలకు చెందిన ఆలేటి పవన్, హనుమండ్ల రజనీకాంత్, బీర వంశీ, ఏరుకుల ప్రశాంత్, సల్లూరి చైతన్యకుమార్, తాళ్లపెల్లి రవీందర్ పరారీలో ఉన్నారన్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టు ద్వారా బాధితులకు అప్పగిస్తామని సీపీ వివరించారు. కాగా ప్రస్తుతం ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలు నిత్యం సెల్ఫోన్స్, ల్యాప్టాప్లపై లీనమవుతున్నారని, వారిపై ఓ కన్నేసి ఇలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు.
ముఠాను పట్టుకున్న సిబ్బందికి అభినందనలు
ముఠాను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని సీపీ తరుణ్జోషి ప్రత్యేకంగా అభినందించారు. వారిలో సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప, టాస్క్ఫోర్స్ ఏసీపీ ప్రతాప్కుమార్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, గొర్రె మధు, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ అనాలిటికల్ అధికారి సల్మాన్పాషా, హెడ్ కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, సోమయ్య, కానిస్టేబుళ్లు సలీం, చిరంజీవి, శ్రీకాంత్, సృజన్, శ్రీనివాస్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర ఉద్యోగులకు రిలీఫ్.. జూలై నుంచి డీఏ పెంపు