వానకాలం సాగుకు రైతులకు అండగా ఉండాలి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
వ్యవసాయంపై ఏసీపీతో కలిసి సమీక్ష
శాయంపేట, జూన్ 14: కల్తీ విత్తనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ రైతులకు అండగా ఉంటున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలకేంద్రంలో రైతులు, వ్యవసాయాధికారులు, విత్తన డీలర్లుతో సోమవారం ఆమె పరకాల ఏసీపీ శ్రీనివాస్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ కల్తీ విత్తనాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు కల్తీ విత్తనాలను ఎవరు విక్రయించినా ఉపేక్షించొద్దన్నారు. రై సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలంగా నీళ్లు రావడంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి క్లస్టర్లను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించారన్నారు.
అధికారులు బాధ్యతతో ఉండాలి
సీఎం కేసీఆర్ గట్టి సంకల్పంతో పని చేస్తున్నారని, కిందిస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతతో పని చేస్తేనే అనుకున్నది సాధిస్తామని జడ్పీ చైర్పర్సన్ అన్నారు. గుంటూరు విత్తనాలు తెచ్చి రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వ్యవసాయ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రైతులకు కావాల్సిన యూరియాను సకాలంలో అందించేందుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జేడీఏతో మాట్లాడారన్నారు. ఎమ్మార్పీ ధరకు విక్రయాలు చేయాలన్నారు. రైతులు రసీదులు తీసుకోవాలన్నారు. మండలంలో 52 ఎకరాలకు సరిపడా కందులకు పూర్తి సబ్సిడీ ఉందన్నారు. మండలంలో 860 ఎకరాల్లో మిర్చి సాగు అవుతుందని తెలిపారు. పరకాల ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా గుంటూరు విత్తనాలు అమ్మితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సమీక్షలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఏవో గంగాజమున, వైస్ ఎంపీపీ లత, పీఏసీఎస్ చైర్మన్ శరత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మనోహర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.