రోగులకు సరైన చికిత్స అందించేందుకు టాస్క్ఫోర్స్
మానుకోట జిల్లాలో 750 బృందాల పర్యటన
లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ చికిత్స
రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానలో తనిఖీ
పీపీఈ కిట్ ధరించి కొవిడ్ వార్డులోకి..
బాధితులకు కల్పిస్తున్న వసతులపై ఆరా
మహబూబాబాద్, మే 14 : సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో యావత్తు యంత్రాంగం కొవిడ్ బారిన పడిన రోగులను కాపాడే పనిలో ఉన్నట్లు రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మానుకోట జిల్లా దవాఖానను కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆమె సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి కొవిడ్ వార్డును పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, దవాఖానలో ఉన్న సౌకర్యాలు, కావాల్సిన వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీని నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు కరోనా బారిన పడకుండా సరైన చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 750 బృందాలు నిత్య పర్యవేక్షణతో పాటు కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తాయన్నారు. ఇంటింటికీ వెళ్లి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారికి మందులు, మనోధైర్యాన్ని అందిస్తాయన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను దవాఖానకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్యాన్ని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు.
కరోనాను నియంత్రించేందుకు అత్యవసరంగా పనిచేస్తున్న రెమ్డెసివిర్, ఆక్సిజన్ సిలిండర్, అత్యవసర మందులు బఫర్ స్టాక్ ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆన్లైన్లో ఎదురయ్యే సమస్యలను తొలగించామన్నారు. కరోనాతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించడంలో అధికారులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. లాక్డౌన్ను విజయవంతం చేసి, కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రితో పాటు దవాఖాన పర్యవేక్షకులు డాక్టర్ వెంకట్రాములు, జిల్లా కొవిడ్ నోడల్ అధికారి సతీశ్ రాథోడ్, ఆర్ఎంవో చింత రమేశ్ ఉన్నారు.
కొవిడ్ బాధితుల పిల్లలను ఆదుకుంటాం
కరోనా వ్యాధి బారిన పడిన తల్లిదండ్రుల పిల్లలను ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన చైల్డ్ హెల్ప్లైన్ కరపత్రాలను కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కరోనా బారిన పడితే పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా వారి సంరక్షణ కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. 1098 లేదా 040-23733665 నంబర్కు సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు వచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తారన్నారు. జిల్లా కేంద్రం, గూడూరు మండల కేంద్రా ల్లో బాలల సదనం ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఆపద వచ్చిన వారు బాలల సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, వడ్డేబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.