చేతులకు రుద్దుకుంటే వైరస్ చావక మనిషి చావుకు ఎసరు
గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు
500 లీటర్ల సరుకు స్వాధీనం
హన్మకొండ సిటీ, మే14: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే కొందరు సందట్లో సడేమియాగా పండుగ చేసుకుంటున్నారు. కొవిడ్ చికిత్స, ముందస్తు నివారణను ఆసరగా చేసుకుని మందులను బ్లాక్లో విక్రయించి కటకటాల పాలయ్యారు. తాజాగా మరి కొందరు బహిరంగంగానే నకిలీ శానిటైజర్లను విక్రయిస్తూ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాస్ జీ తెలిపిన వివరాల ప్రకారం.. సీపీ ఆదేశాల మేరకు శుక్రవారం మట్టెవాడ పీఎస్ సమీపంలో శానిటైజర్ విక్రయాలపై దాడులు నిర్వహించారు. డబ్ల్యూహెచ్వో నిబంధనలకు విరుద్ధంగా నకిలీ శానిటైజర్ను బాటిల్స్, స్ప్రే బాటిళ్లలో నింపి గుర్తు తెలియని కంపెనీల స్టిక్కర్లను అతికించి మార్కెట్లో విక్రయిస్తుండగా, దాడిచేసి వారి వద్ద నుంచి రూ.లక్ష విలువచేసే 500 లీటర్ల శానిటైజర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రొల్ల శ్రీనివాస్, పరిమి ప్రసాద్రావు, యంసాని విశ్వేశ్వర్, పెద్ది ప్రేమ్కుమార్, చిమ్మని శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. నకిలీ శానిటైజర్లు వినియోగించి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని, అలాంటి వాటిని వాడొద్దని సీఐ సూచించారు.
సీపీ ఆకస్మిక తనిఖీలు
నగరంలో సీపీ తరుణ్జోషి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వారిపై కొరడా ఝలిపిస్తున్నారు. లాక్డౌన్ అమలును పర్యవేక్షించడంతో పాటు స్వయంగా వాహన తనిఖీల్లో పాల్గొని గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. పని లేకుండా వచ్చే వారిని మందలిస్తున్నారు. సదరు వాహనాలను పోలీస్స్టేషన్లకు తరలించి సీజ్ చేయిస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చే వారిని వదిలిపెట్టొద్దని సీపీ ఆదేశించడంతో చెక్పోస్టుల్లో పోలీసు సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మినహాయింపు ఉన్న వారిని మాత్రమే గుర్తింపు కార్డులు చూసి వదిలేస్తున్నారు.