ఏడో విడుత కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 2.02 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
జిల్లాల వారీగా ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు
ప్రతి పంచాయతీ నర్సరీలో 10వేల చొప్పున మొక్కలు
ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీకి సన్నాహాలు
వరంగల్రూరల్, జూన్ 13(నమస్తేతెలంగాణ) : ‘తెలంగాణకు హరితహారం’ ఏడో విడుత కార్యక్రమం కోసం అధికారయంత్రాంగం సమాయత్తమవుతున్నది. పంచాయతీ, మున్సిపాలిటీ, వరంగల్ మహా నగర పరిధిలో మొక్కలు నాటేందుకు ప్రాంతాలను గుర్తిస్తున్నది. ముందస్తుగా గుంతలు తవ్వించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో అవెన్యూ ప్లాంటేషన్ కోసం రహదారులను పరిశీలిస్తున్నది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 2,02,74,600 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం పంచాయతీ, మున్సిపాలిటీ, వరంగల్ నగర పాలక సంస్థ నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసింది.
పంచాయతీ నర్సరీల్లో పదివేల చొప్పున మొక్కలు పెంచుతున్నది. జనగామ, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలు, వరంగల్ నగర పాలక సంస్థ పరిధి నర్సరీల్లోనూ వివిధ రకాల మొక్కలను సిద్ధం చేసింది. ప్రతి నర్సరీలో నీడనిచ్చే మొక్కలు, పండ్లు, పూల మొక్కలు రెడీ అయ్యాయి. ప్రజలు కోరుకునే మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసేలా అధికారులు ప్లాన్ చేశారు. మిగతావి మంకీ ఫుడ్కోర్టులు, పల్లె ప్రకృతి వనాల్లో నాటే ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ నర్సరీల్లోని మొక్కలతో పాటు గతేడాది నుంచి కొన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల నర్సరీల్లో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ కింద రహదారులకు ఇరువైపులా నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వేగంగా ఏర్పాట్లు
ప్రభుత్వ ఆదేశాలతో ఏడో విడుత హరితహారం కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామాల్లో ఇప్పటికే మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాం. అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటే రహదారులను కూడా పరిశీలించాం. ప్రతి పంచాయతీ నర్సరీలో పది వేల చొప్పున మొక్కల పెంపకం చేపట్టాం. గుంతలు తవ్వే పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ప్రభుత్వం తేదీ ప్రకటించగానే మొక్కలు నాటడం ప్రారంభిస్తాం.
ఎం సంపత్రావు, డీఆర్డీవో, వరంగల్ రూరల్