పంటలకు తగ్గట్లుగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
ఉమ్మడి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
ముడి పదార్థాలతో వివిధ రకాల ఉత్పత్తులు
స్థానిక అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు
వరంగల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి జలాలతో పునీతమై ధాన్యాగారంగా విలసిల్లుతున్న ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అనుబంధ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తున్నారు. కనీసం 250 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్లు ఉండేందుకు అనువైన భూములను పరిశీలిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, స్థానిక యువత, మహిళలకు ఉపాధి లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నారు.
పలుచోట్ల స్థలాల గుర్తింపు
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని దా దాపు 600 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రెవె న్యూ అధికారులు భూములను గుర్తించారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడలో వంద ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం గుండ్రాతిమడుగు, ఇతర గ్రామాల్లోనూ లభ్యతను పరిశీ లిస్తు న్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండ లం ములుగుపల్లిలో ప్రతిపాదిస్తున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం ఒకేచోట వివాదాలు లేని ప్రభు త్వ భూములను మన్పహాడ్ కాశెగుడిసెల(దాదా సాహెబ్ కాలనీ ఏనెలు) ప్రాంతంలో గుర్తించారు. కొద్దిరోజుల క్రితం డిజిటల్ సర్వే పూర్తిచేసి నివేదికను జనగామ కలెక్టర్ కే నిఖిలకు అందించారు. మొత్తం 145 ఎకరాల భూములను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట మార్పిడి చేసి అప్పగించా రు. జోన్పై టీఎస్ఐఐసీ అధికారులు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేసే పనిలో నిమగ్నమయ్యారు.
విరివిగా పంటలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వ్యవసాయ రంగం బలోపేతమైంది. కాళేశ్వరం, దేవాదుల, ఇతర ప్రాజెక్టుల నీటి ద్వారా విరివిగా వరి పండడంతో పాటు కందులు, పెసలు, మిను ములు, పల్లి, శనగ, మక్క, మిరప, పసుపు, పండ్లు, కూరగాయల సాగు గణనీయంగా పెరిగింది. రైతులు పండించే పంటలకు ఇప్పటి కన్నా మెరుగైన మార్కెటింగ్ వసతిని స్థానికంగానే కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తెరపైకి తెచ్చింది. జిల్లాల వారీగా ఎక్కువ సాగయ్యే రకాలకు అనుగుణంగా ఆహార శుద్ధి, దిగుబడుల సంస్కరణ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
జిల్లాలవారీగా అనుకూలతలు
వరంగల్ అర్బన్ జిల్లాలో ఎనుమాముల మార్కెట్ యార్డుకు ఎక్కువగా తృణ ధాన్యాలు, పప్పులు వస్తుంటాయి. ఇందుకు సంబంధించి పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో మిరప(కారం), పసుపు, మహబూబాబాద్ జిల్లాలో మిరప (కారం), పండ్లు, ములుగు జిల్లాలో మిరప (కారం), జనగామ జిల్లాలో కందగడ్డ, పప్పు దినుసులు, నూనె, మక్క, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూరగాయల సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామస్థాయి నుంచి ప్రత్యేక వ్యవస్థ ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల కోసం 600 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వమే ఎక్కువ పంటలను కొనుగోలు చేస్తున్నది. వీటిని ప్రాసెసింగ్ చేయడం వల్ల అదనంగా లాభాలు (వాల్యూ యాడెడ్) వస్తాయని భావిస్తున్నది. ఆహార పంటలు, పండ్లు, కూరగాయల ఆధారంగా ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించనుంది. ఈ రంగంలో మహిళా సంఘాలది కీలకపాత్ర కానుంది. పంటల కొనుగోలుతోపాటు ఆహారశుద్ధి ప్రక్రియ వీరి ఆధ్వర్యంలోనే జరిగేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో భాగంగా రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులను ఏర్పాటు చేసేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.
స్థానిక యువత, మహిళలకు ఉపాధి..
టీఎస్ఐఐసీ ద్వారా ఏర్పాటుకానున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో స్థానిక యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. ఒక్కో జోన్ పరిధిలో సుమారు వందకు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రానున్నాయి. వీటిద్వారా ఒక్కో జోన్ పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10వేల మందికి పని దొరకనుంది. అంతర్జాతీయ కంపెనీలు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉండడంతో జిల్లాల స్థితిగతులు మారనున్నాయి.
యూనిట్ల ఏర్పాటు ఇలా..
కేటాయించిన భూముల్లో ముందుగా రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్, నీటి వసతి కల్పించి పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. తాము ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు సంబంధించి పూర్తి ప్రాజెక్టు నివేదికతోఅవసరమైన స్థలం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ప్రభుత్వం సూచించిన ధర చెల్లించి పరిశ్రమ కోసం స్థలం పొందవచ్చు. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు సహా రాష్ట్రం, దేశ, విదేశాల నుంచి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపితే ఒప్పందం మేరకు స్థలాలు కేటాయిస్తారు. రెండేళ్లలో తాము నెలకొల్పబోయే యూనిట్ను అభివృద్ధి చేసుకోలేని పక్షంలో ప్రభుత్వమే తిరిగి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుందని టీఎస్ఐఐసీ అధికారులు చెబుతున్నారు.