వర్ధన్నపేట/పరకాల: మే 11: అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాలు, కల్ల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసింది. రక్షించుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ధాన్యపు కుప్పలపై టార్పాలిన్లు కప్పారు. ఈదురుగాలికి మామిడికాయలు నేలరాలాయి. దీంతో రైతులు అకాల వర్షం తమను నిండా ముచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నడికూడలో వడగండ్ల వాన
నడికూడ: మండలంలో వడగండ్ల వాన పడింది. దీంతో పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. కంఠాత్మకూర్ పంచాయతీలో చెట్లు కూలిపోయాయి. గ్రామాల్లో ఆరబోసిన వడ్లు తడువడంతో అన్నదాతలు ఆగమాగమయ్యారు.
చిరుజల్లులు..
ఆత్మకూరు/గీసుగొండ/దామెర: మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు కురిశాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. అక్కడక్కడ గాలివానతో చెట్లు , చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
శాయంపేటలో భారీ వర్షం
శాయంపేట: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లోనూ భారీ వర్షం పడింది. సుమారు గంట వరకు వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొనుగోలు కేంద్రాలతో పాటు పొలాల్లో ఆరబోసిన వడ్లపై టార్పాలిన్లు కప్పారు. అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు నీట మునగడంతో చేతికందే పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపనపెల్లి, కొంకపాక, ఏనుగల్లులో మక్కలు, ధాన్యం తడిసి కొట్టుకుపోయాయి. నీట మునిగిన వడ్ల బస్తాలను జడ్పీటీసీ సింగిలాల్ పరిశీలించి రైతులను పరామర్శించారు. చెరువుకొమ్ము తండాలో పిడుగు పాటుకు ధరావత్ రవీందర్కు చెందిన ఎద్దు మృతిచెందింది. అన్నారం షరీఫ్లో సయ్యద్ మహబూబ్ పాషా ఇంటి ప్రహరీ కూలిపోయింది. కల్లెడ, తురకల సోమారం, జమాలపురంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు నీటమునిగాయి.
నెక్కొండలో తడిసిన ధాన్యం, మక్కజొన్న
నెక్కొండ: మండలంలోని నెక్కొండ, ముదిగొండ, తోపనపల్లి, రెడ్లవాడ గ్రామాల్లో జోరువానకు ధాన్యం తడిసి ముద్దయింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు నీటిపాలయ్యాయి. ముదిగొండ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ శైలజ, హరిశ్చంద్రుతండా సర్పంచ్ వీరునాయక్ పరిశీలించారు. రెడ్లవాడలో తడిసిన ధాన్యాని సొసైటీ చైర్మన్ జలగం సంపత్రావు పరిశీలించి రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. గాలివానకు చెట్లు విరిగి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ప్రజలు తెలిపారు.
తాటి, కొబ్బరి చెట్లపై పిడుగుపాటు
సంగెం/చెన్నారావుపేట: మండల కేంద్రానికి చెందిన సలేంద్ర సదానందం ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడి పూర్తిగా కాలిపోయింది. అలాగే చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయనిపహాడ్లో పిడుగు పడితాటి తాటిచెట్టు కాలిపోయింది.