కరోనా పాజిటివ్ కేసులు పెరిగినందుకు గ్రామ పంచాయతీ తీర్మానం
శాయంపేట, జూన్ 11: కరోనా కేసులు పెరుగుతుండడంతో వసంతాపూర్లో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరై వారిలో ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏకంగా పెండ్లి కూతురుతోపాటు తల్లికి పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు టెస్టులు చేయడంతో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. బాధితులకు సూచనలు చేస్తున్నారు. జీపీ తీర్మానంతో ఐదు రోజులు గ్రామంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. అలాగే, పక్కనున్న కాట్రపల్లిలోనూ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శాయంపేట జడ్పీఎస్ఎస్లో శుక్రవారం 21 మందికి పరీక్షలు చేయగా, గోవిందాపూర్లో ఒకరు, మాందారిపేటకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు.