వరంగల్ రూరల్ జిల్లాలో జ్వర సర్వే పూర్తి
లక్షణాలున్నవారికి ఇంటివద్దే ఐసొలేషన్ కిట్లు
ఆదిలోనే కరోనా కట్టడికి బాటలు
లక్షణాలున్నట్లు తెలియనివారికి, పేదలకు ఎంతో ప్రయోజనం
దవాఖానల చుట్టూ తిరిగి జేబులు ఖాళీ చేసుకోకుండా మేలు
వరంగల్ రూరల్, మే 10 (నమస్తేతెలంగాణ): కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘జ్వర సర్వే’ వరంగల్ రూరల్ జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఇంటింటికీ తిరిగి, కొవిడ్ లక్షణాలున్న వారిని ముందే గుర్తించి, ప్రారంభ దశలోనే చికిత్స అందించడం, తద్వారా కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేయడం ఈ సర్వే లక్ష్యం. ప్రారంభ దశలోనే మందులు ఇంటివద్దే వాడడం వల్ల వ్యాధి విస్తృతం కాకుండా ఉండడంతో పాటు హాస్పిటళ్లపై ఒత్తిడి పెరుగకుండా చూడడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు రూరల్ కలెక్టర్ నేతృత్వంలో జడ్పీ సీఈవో పర్యవేక్షణలో జ్వర సర్వేను పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పూర్తి చేశాయి. జిల్లాలోని 401 పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లోని 1,61,384 ఇండ్లలో 1,351 బృందాలు సర్వే చేశాయి.
నాలుగు రోజులు.. 1,61,384 ఇండ్లు..
కలెక్టర్ ఎం హరిత ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు, పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు నాలుగు రోజుల పాటు సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గురువారం ప్రారంభమైన సర్వే ఆదివారం ముగిసింది. నాలుగు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి 1,61,384 ఇండ్లలో బృందాలు జ్వరసర్వే చేశాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై సమగ్ర సమాచారం సేకరించి, గ్రామం యూనిట్గా నివేదికలను ప్రభుత్వానికి అందించాయి. గ్రామాల్లో లక్షణాలున్నట్లు గుర్తించిన వారికి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
2,032 మెడికల్ కిట్ల పంపిణీ
లక్షణాలను గుర్తించిన వెంటనే మందులు పంపిణీ చేయడం వల్ల రోగుల సంఖ్య పెరిగే అవకాశం లేదని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లక్షణాలతో ఉన్నవారికి సరైన వైద్యం అందిస్తే జిల్లాలో కరోనాను కట్టడి చేయవచ్చునని చెబుతున్నారు. గ్రామాల వారీగా కరోనా వైరస్ లక్షణాలున్న వారి జాబితాలు అందడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆశ వర్కర్ల ద్వారా మెడికల్ కిట్ల పంపిణీ చేపట్టారు. ఆదివారం వరకు జిల్లాలో 2,032 మందికి మెడికల్ కిట్లను అందజేశారు. మిగతా వారికీ యుద్ధప్రాతిపదికన కిట్లను ఇచ్చే పనిలో ఉన్నారు. సర్వేలో అనారోగ్య సమస్యలు తెలుసుకొని, ప్రత్యేక ప్రొఫార్మాలో నమోదు చేశారు. సమాచారాన్ని బృంద సభ్యులు ఎప్పటికప్పుడు గ్రామం వారీగా స్థానిక ఏఎన్ఎం, ఆశవర్కర్ల ద్వారా వైద్య అధికారులకు పంపారు. సర్వే ముగిసిన వెంటనే సమగ్ర నివేదికను ఆదివారం వైద్య ఆరోగ్యశాఖకు అందజేశారు. లక్షణాలున్న వారికి వెంటనే మెడికల్ కిట్ల పంపిణీని కూడా అధికారులు ప్రారంభించారు. సర్వే జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి రోగులకు కిట్లను అందజేసి జాగ్రత్తలు వివరిస్తున్నారు. తీవ్రతను బట్టి కొందరిని దవాఖానలకు పంపిస్తున్నారు. సర్వే కారణంగా తమకు కరోనా లక్షణాలున్నాయని గుర్తించని వారికి, పేదలకు ఏ ఎంతో ప్రయోజనం కలిగింది. దవాఖానల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు చేసుకునే అవసరం లేకుండా ఇంటికి వచ్చి మందులు ఉచితంగా ఇవ్వడంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.