చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
అంబేద్కర్ భవన్లో ముస్లింలకు దుస్తుల పంపిణీ
నయీంనగర్, మే 9 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో పేద ముస్లింలకు తహసీల్దార్ రాజ్కుమార్ అధ్యక్షతన దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా చీఫ్విప్ హాజరై మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్పై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు. అందుకే నగరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ, వారి సంప్రదాయాలు, పండుగలను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ 252 పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో సుబేదారిలో రూ.2కోట్లతో బాంక్వెట్ హాల్, నిరుద్యోగుల కోసం ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇవి నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ కిరణ్, కార్పొరేటర్ నల్లా స్వరూపారాణి, టీఆర్ఎస్ నాయకులు కే సుగుణాకర్రెడ్డి, రాందాస్, ధనుంజయ్, ఉపేందర్, విజయ్, బంటి తదితరులు పాల్గొన్నారు.