మృతదేహాల అంతిమ సంస్కారాలకు తోడ్పాటు
బాధితులకు అండగా ప్రథమ పౌరులు
సర్పంచ్లకు మంత్రి ఎర్రబెల్లి ప్రశంస
దేవరుప్పుల, మే 8 : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కరోనా కష్టకాలంలో బాధితులకు సర్పంచ్లు చేయూతనిస్తున్నారు. అలాగే, కరోనా నివారణకు కృషి చేస్తున్నారు. కరోనాతో మృతి చెందిన వారిని చూడాలన్నా భయపడుతున్న ఈ కాలంలో మృతదేహాలు గ్రామానికి రాగానే దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాంపురం, కడవెండి, అప్పిరెడ్డిపల్లి, నీర్మాల, దేవరుప్పుల, పెద్ద మడూరు గ్రామాల్లో కరోనా రోగులు మృతిచెందగా ఆయా గ్రామాల సర్పంచ్లు శ్మశానవాటికల వద్ద మృతదేహాలను ఖననం చేయించారు. అలాగే, గ్రామాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పండ్లు, గుడ్లు, ఇతర బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. కరోనా అదుపు చేయడానికి వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించడానికి దండోరా, మైక్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మన్పహాడ్ సర్పంచ్ వర్రె మధు మరో అడుగు ముందుకేసి, తన సొంత ట్రాక్టర్లో జనాన్ని పీహెచ్సీకి తరలించి, కరోనా టీకా వేయించి, తిరిగి గ్రామానికి చేర్చుతున్నారు. మరికొన్ని కరోనా తీవ్రత ఉన్న గ్రామాల్లో స్వయంగా లాక్డౌన్ పెట్టిని వైరస్ను కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన మెడికల్ కిట్లను పాజిటివ్ కేసులకు స్వయంగా అందిస్తున్నారు. కాగా, మండలంలో సర్పంచ్లు చూపుతున్న చొరవను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంసించారు.