సాంకేతిక సంస్థలో మియావాకి వనం
రెండు వేల చెట్లతో దట్టంగా అడవి
హరితహారం స్ఫూర్తితో మొక్కల పెంపకం
రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో అభివృద్ధి
వరంగల్, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కొత్త శోభను సంతరించుకుంది. ఒకేచోట దట్టంగా మొక్కలను పెంచే(మియావాకి) విధానంతో ప్రఖ్యాత జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో చిట్టడవి ఏర్పాటైంది. రాష్ట్ర అటవీశాఖ సహకారంతో నిట్ అధికారులు, సిబ్బంది కలిసి సంస్థ ఆవరణలో చిట్టడవి రూపుదిద్దుకునేలా చేశారు. సువిశాల ఆవరణలో పచ్చని చెట్లతో దట్టంగా పెరిగిన చిట్టడవి నిట్కు మరింత ఆకర్షణీయంగా మారింది. నిట్ ఆడిటోరియం వెనుక వైపు 2019 ఆగస్టు 15న చిట్టడవికి అంకురార్పణ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది ఒక్కొక్కరుగా రెండు వేల మొక్కలు నాటారు. మర్రి, రావి, వెదురు వంటి అటవీ మొక్కలు, అన్ని రకాల పండ్ల మొక్కలు నాటగా అటవీ శాఖ సహకారం, నిట్ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దాదాపు పెట్టిన మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. ఏ కారణంగానైనా ఏదైనా మొక్క చనిపోతే దాని స్థానంలో వెంటనే మరో మొక్క నాటుతున్నారు. వీటి సంరక్షణ కోసం నిత్యం ఐదారుగురు పని చేస్తున్నారు. ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా పొద్దున, సాయంత్రం నీళ్లు పడుతున్నారు. మొక్కలన్నీ ఏడాదిన్నరలోనే దట్టంగా పెరుగడంతో ఆడిటోరియం వెనుక ప్రాంతం అడవిని తలపిస్తున్నది. 256 ఎకరాల విస్తీర్ణంలో ఉండే నిట్ జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటి. నివాస గృహాలు పెరుగడంతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్నది. చెట్ల ప్రాధాన్యతను భవిష్యత్ తరాలకు చెప్పే లక్ష్యంతో నిట్లో చిట్టడవి ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఏడాదిన్నర క్రితం మొక్కలు నాటడంతో ఇప్పుడు దట్టమైన అడవి ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2400 మొక్కలు నాటారు. మరో రెండు వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిట్ యాజమాన్యం తెలిపింది.