తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన 18 ఏండ్లలోపు బాలలను ఆదుకునేందుకు
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
చిన్నారులను గుర్తించేందుకు నంబర్ 040 23733665
ప్రతి కుటుంబానికి నగదు, 16 రకాలతో సరుకుల కిట్ల పంపిణీ
రూరల్ జిల్లాలో 45 మంది గుర్తింపు
వరంగల్రూరల్, జూన్ 6(నమస్తేతెలంగాణ): కరో నా మహమ్మారి అనేక కుటుంబాలను కకావికలం చేస్తున్నది. తీరని వ్యథను నింపుతున్నది. ప్రధానంగా వైరస్తో తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రి, సంరక్షకులను కోల్పోయిన బాలలకు ఆదరణ కొరవడుతున్నది. ఈ నేపథ్యంలో నిస్సహాయ బాలలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చిన్నారులకు ఆపత్కాల సాయం నగదు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి భరోసా ఇస్తోంది. కొద్దిరోజుల నుంచి అధికారులు జిల్లాలో 25 కుటుంబా ల్లో 45 మంది నిస్సహాయ బాలలను గుర్తించారు. ఇప్పటికే ఏడు కుటుంబాలకు నగదు, 16 రకాల నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్లోనిమహిళాభివృద్ధి కార్యాలయంలో కొన్నిరోజుల క్రితం బాలల సహాయవాణి పేరుతో టోల్ఫ్రీ నంబర్ 040 23733665 ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఉద యం 9నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనుందని ప్రకటించింది. కరోనాతో తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రిని, సంరక్షకులను కోల్పోయిన బాలల సమాచారాన్ని ఈ టోల్ఫ్రీ నంబరుకు లేదా చైల్డ్ హెల్ప్లైన్ నంబరు 1098కు గాని ఫోన్చేసి తెలుపాలని పేర్కొంది. ఈ మేరకు మహిళాభివృద్ధిశాఖలోని బాలల పరిరక్షణ విభాగం విస్తృత ప్రచారం చేపట్టింది.
45 మంది బాలల గుర్తింపు
సహాయవాణి టోల్ఫ్రీ, చైల్డ్ హెల్ప్లైన్ నంబర్లకు వచ్చిన సమాచారంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ టీచర్లు కొద్దిరోజుల నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఆదరణ కరువైన 18 ఏండ్లలోపు బాలలను గుర్తిస్తున్నారు. ఆయా కుటుంబాల్లో సభ్యులు, చనిపోయిందెవరు, 18 ఏండ్లలోపు బాలలెందరు ఉన్నారు, ప్రస్తు తం వారు ఏం చదువుతున్నారు, ఆర్థిక పరిస్థితి ఏమిటనే వివరాలను సేకరిస్తున్నారు. ఆపదలో కాల్ చేయాల్సిన ఫోను నంబర్లను ఈ కుటుంబ సభ్యులు, నిస్సహాయ బాలలకు ఇస్తున్నారు. కుటుంబాల వారీగా సమగ్ర నివేదికను బాలల సంరక్షణ విభాగం అధికారులకు అందజేస్తున్నది. జిల్లాలో శనివారం వరకు కరోనాతో 25 కుటుంబాల్లో 45 మంది బాలలు ఆదరణ కోల్పోయినట్లు గుర్తించామని జిల్లా సంక్షేమ ఇన్చార్జి అధికారి రాజారావు వెల్లడించారు. ఈ కుటుంబాల్లోని కొన్నింటిలో ఇద్దరు, ముగ్గురు బాలలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. నిస్సహాయ బాలలకు అండగా నిలవడంపై కలెక్టర్ ఎం హరిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు.
నగదు, సరుకుల పంపిణీ
నిస్సహాయ బాలలకు ప్రస్తుతం అధికారులు ఆపత్కాల సాయం, నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. తమకు అందిన నివేదిక ప్రకారం బాలల పరిరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో బాల ల ఇండ్లకు వెళ్తున్నారు. ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి నగదు, 16 రకాల నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తున్నారు. ఈ కిట్టులోని సరుకుల విలువ రూ.1,250 ఉంటుంది. ప్రభుత్వం విద్యా వసతి కల్పించనుందని, ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉందని, బాలలు, బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నాలుగు కుటుంబాలకు, బండౌతపురం గ్రామంలోని ఒక కుటుంబానికి, సంగెం మండలం తిమ్మాపూర్లోని రెండు కుటుంబాలకు అపత్కాల సాయం, నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసినట్లు బాలల పరిరక్షణ విభాగం జిల్లా అధికారి మహేందర్రెడ్డి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో మిగత కుటుంబాలకు సైతం నగదు, సరుకులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.