నర్సంపేట, జూన్ 5: లబ్ధిదారులకు మంజూరైన పాడి గేదెలను ఇతరులు కొనుగోలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేటలో పాడిగేదెలు అందించేందుకు నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లోని లబ్ధిదారులకు ప్రొసీ డింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులకు మంజూరైన పాడి గేదెలు వారివద్దే ఉండాలన్నారు. వద్దనుకుంటే ఇతరులకు అందజేస్తామన్నారు. నిరుపేదలు ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో పాడి గేదెలను అందిస్తున్నామన్నారు.
గేదెలకు ఉచితంగా మూడు నెలలపాటు దాణాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, గేదెలు జబ్బు పడినా, చనిపోయినా వాటికి ఏడాది పాటు ఉచిత బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా కలెక్టర్ హరిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, లీడ్ బ్యాంకు మేనేజర్, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పాడి గేదెలు మంజూరైన ప్రతి రైతుకు రూ.68వేలతో షెడ్డు నిర్మాణం కూడా ఉచితంగా నిర్మించి ఇస్తారన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశామని, ఒక్కో పాడి గేదెకు సుమారు రూ.లక్ష చొప్పున కుటుంబానికి నాలుగు పాడి గేదెలు అంటే రూ.4లక్షల మేర ఖర్చు అవుతుందన్నారు. అందులో 60శాతం సబ్సిడీ కింద రూ. 2.40 లక్షలు, మిగిలిన రూ.1. 60 లక్షలు బ్యాంకు రుణంకింద చెల్లించాల్సి ఉం టుందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన రైతులకు మినీ డైరీ ప్రాజెక్టు మంజూరు చేస్తారని తెలిపారు. ప్రస్తుతం నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో 114 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, జడ్పీఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్తో కరోనా దూరం
వ్యాక్సినేషన్తోనే కరోనాను దూరం చేయవచ్చని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి టీకాలు వేస్తున్నామని, లాక్డౌన్తో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించి హోం ఐసొలేషన్లో ఉండాలన్నారు. కరోనా బాధితుల కోసం దవాఖానల్లో బెడ్లను అందుబాటులోకి తెచ్చామని, అవసరమున్న వారికి ఆక్సిజన్ బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ వైరస్ బారిన పడకుడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.