గ్రామాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలి
విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్
దుగ్గొండి, జూన్ 4: వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ కరోనా కట్టడికి కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్ సూచించారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. ఓపీ సేవలతోపాటు కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలన్నారు. గ్రామాల్లో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ కరోనా టీకాలు వేయాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రైవేట్ దవాఖానలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరేశ్ డిప్యూటీ డీఎంహెచ్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దుగ్గొండి పీహెచ్సీ సిబ్బంది సాంబయ్య, రెహమాన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
యాక్టివ్ కేసులపై దృష్టి సారించాలి
శాయంపేట: ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సిబ్బంది, కార్యదర్శులు నిత్యం గ్రామాలను పర్యవేక్షిస్తూ యాక్టివ్ కేసులపై దృష్టి సారించాలని జిల్లా శిక్షణ వైద్యాధికారి డాక్టర్ అశ్విన్కుమార్ సూచించారు. శాయంపేటలోని పీహెచ్సీ, హెల్త్ సబ్సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో కరోనా కేసుల వివరాలు తెలుసుకున్నారు. కరోనా సోకిన వ్యక్తి ఉన్న ఇంట్లో వైరస్ వ్యాప్తి చెందకుండా కుటుంబ సభ్యులకు సూచనలు చేయాలన్నారు. ఇంట్లోనూ అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. శుభకార్యాలు జరిగే చోట గుంపులుగా ఉండొద్దన్నారు.
జ్వరం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి
నర్సంపేట/చెన్నారావుపేట/ఆత్మకూరు/నెక్కొండ: జ్వరం వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ కోరారు. నర్సంపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ను ఆయన పరిశీలించారు. పది మందికి టీకాలు వేశారు. 23 మందికి పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 41 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశామన్నారు. చెన్నారావుపేటలో 61 మందికి కరోనా పరీక్షలు చేయగా, 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. ఆత్మకూరు పీహెచ్సీలో 100 మందికి కరోనా పరీక్షలు చేయగా, 25 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రణధీర్ తెలిపారు. నెక్కొండ మండలం చిన్నకోర్పోలులో 149 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సుమంత్ తెలిపారు. నెక్కొండ పీహెచ్సీలో 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్యాధికారి రమేశ్ తెలిపారు.