వరంగల్రూరల్, జూన్ 2 (నమస్తేతెలంగాణ): అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో విస్మరించిన రంగాలను ఒక్కొక్కటిగా ఓపిక, దార్శనికతతో అవాంతరాలను లెక్కచేయకుండా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సరిదిద్దుకొస్తున్నారని కొనియాడారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వినోద్కమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు. సుదీర్ఘంగా, శాంతియుత పద్ధతితో అన్ని వర్గాల ప్రజల కృషి ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్నిరంగాల్లో దేశం గర్వించదగిన రీతిలో సీఎం కేసీఆర్ నిలబెట్టారని వినోద్కుమార్ అన్నారు. ఏడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం దృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విశేష కృషి ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రోడ్లు తదితర మౌలిక వసతులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో పూర్తి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సాధన రాష్ట్ర సాధనకు కృషి చేసిన ప్రతి ఒకరూ గర్వపడే రోజు ఇదని వినోద్కుమార్ అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని తెలిపారు.
నిరాడంబరంగా వేడుకలు
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా వినోద్కుమార్ హాజరయ్యారు. తొలుత ఆయన అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో వినోద్కుమార్కు కలెక్టర్ ఎం హరిత, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో కాసేపు వినోద్కుమార్ ముచ్చటించారు. అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీలో టీఆర్ఎస్ ఫోర్ లీడర్ పెద్ది స్వప్న, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, కలెక్టరేట్ ఏవో రాజేంద్రనాథ్, డీఆర్డీవో ఎం సంపత్రావు, వరంగల్రూరల్ ఆర్డీవో మహేందర్జీ, డీఏవో ఉషాదయాళ్, డీఎంహెచ్వో మధుసూదన్, పరకాల, నర్సంపేట ఏసీపీలు శ్రీనివాస్, ఫణీందర్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, జన్ను జకార్య, ఇండ్ల నాగేశ్వర్రావు, జయపాల్రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.