పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
సంగెం, మే 25 : ‘పాజిటివ్ వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యమే కరోనా వైరస్కు సరైన మందు’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం సంగెం పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్యసేవల వివరాలను డాక్టర్ అశోక్ను అడిగి తెలుసుకున్నారు. దవాఖాన పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని తెలిపారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, పోలీసులకు సమాజం రుణపడి ఉందన్నారు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్రావు వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ బాబు, ఎంపీడీవో మల్లేశం, నరహరి పాల్గొన్నారు.
రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలో రైల్వే మూడోలైన్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 22 మంది రైతులకు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే నష్టపరిహార చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబిడ్డ అయిన కేసీఆర్ సీఎంగా ఉండటం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.