కమలాపూర్ : మండలంలోని మరిపెల్లి దళితులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మరిపెల్లి దళితులతో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమ కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు.
దళిత బంధు పథకం అమలుతో ప్రతిపక్షాలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం వంగపల్లి గ్రామంలో గౌడకులస్తులతో సమావేశమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరిపెల్లికి చెందిన చందుపట్ల వెంకట్రెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, ఎంపీటీసీలు రామస్వామి, లింగారెడ్డి, కెడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు సరోత్తంరెడ్డి, పోడేటి సారయ్య తదితరులున్నారు.