మట్టెవాడ, అక్టోబర్ 14 : పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చీఫ్విఫ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్, 11వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం డాక్టర్ బాబు జగ్జీవన్ రాం కమ్యూనిటీ హాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదింట పెళ్లి భారం కాకూడదని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రతి ఒక్కరూ గమనించి సీఎం కేసీఆర్కు వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. ఆసరా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నదన్నారు.
వృద్ధాప్య పింఛన్ను 57 సంవత్సరాల వయసు వారికీ ఇస్తుండడంతో కొత్తగా సుమారు 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నదన్నారు. మేయర్ మాట్లాడుతూ.. 33 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించామన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖాముఖి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు. కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, వేముల శ్రీనివాస్, కుడా మాజీ సలహా సభ్యుడు శివశంకర్, డిప్యూటీ కమిషనర్ జోనా, శానిటరీ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు రాచర్ల రాము, గట్టు చందు, తాళ్లపల్లి రమేశ్, రుద్ర శ్రీనివాస్, శ్రీరాముల సురేశ్, పూజారి కుమారస్వామి, రాచర్ల జగన్, కాసర్ల చంద్రమౌళి, భీంరాజ్, వాడిక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు అభివృద్ధికి రూ.18వేల కోట్లు ఇస్తే తప్పుకుంటాం..
బీజేపీ రాజగోపాల్ రెడ్డికి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి పార్టీలోకి తీసుకుందని, ఆ మొత్తాన్ని మునుగోడు అభివృద్ధికి ఖర్చు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటామని చీఫ్విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కేవలం కాంట్రాక్ట్ కోసం పార్టీ మారిన వ్యక్తి అభివృద్ధిపై ఎలా దృష్టి సారిస్తారో ప్రజలే గమనించాలన్నారు. మతతత్వ శక్తులను తరిమికొట్టాలని ప్రజలను కోరారు.