హనుమకొండ/వరంగల్/హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 10 : హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి ఆలయం ఎంతో విశిష్టమైందని, ఇంతటి చారిత్రక కట్టడం తెలంగాణలో ఉండడం గొప్ప విశేషమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, భరత్కుమార్రెడ్డి, హరి రమాదేవి, జనార్దన్గౌడ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్తో కలిసి శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు వీరికి ఆలయ మర్యాదలతో ఉత్తిష్ఠగణపతి దర్శనం కల్పించి రుద్రేశ్వరస్వామికి మారేడుదళ బిల్వార్చన చేయించి, నీరాజన మంత్రపుష్పాల అనంతరం ఆలయ నాట్యమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందించి మహదాశీర్వచనం ఇచ్చినట్లు ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఆలయ ఆవరణలో ఎంపీ సంతోష్కుమార్ కదంబ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తొలిసారిగా ఈ ఆలయాన్ని సందర్శించానని, శివుడు తమ ఇలవేల్పు అని చెప్పారు.
ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేస్తానన్నారు. వేయిస్తంభాల గుడిని కూడా యునెస్కోలో చేర్చేలా రాష్ట్ర ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. ఆలయంలో 16 ఏళ్లయినా కల్యాణమండపం పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిపెట్టాలని, లేదంటే పార్లమెంట్లో సమస్య లేవనెత్తుతానని చెప్పారు. కాకతీయ రాజులు అందించిన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్రావు, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, ప్రణవ్ ఉన్నారు.
వినూత్నంగా మొక్క-చెక్కుల పంపిణీ
హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన వినూత్నంగా మొక్క- చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్కుమార్ హాజరయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48మందికి సుమారు రూ.23లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, వాటితో పాటు మొక్కలను పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మందికి ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి చెక్కులు అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చీఫ్ విప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వేలాది మందికి కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించామన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెకును అందించి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు.
భద్రకాళికి ప్రత్యేక పూజలు
భద్రకాళీ అమ్మవారిని ఎంపీ సంతోష్కుమార్, మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ దాస్యం, మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో శేషుభారతి, ప్రధానార్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మహామండపంలో వేద పండితులు మహదాశీర్వచనం ఇచ్చి అమ్మవారి శేషవస్ర్తాలను, తీర్థ ప్రసాదాలు అందించారు.