నమస్తే నెట్వర్క్ : రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతుండా, చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురవగా హనుమకొండ, వరంగల్లో మోస్తరు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతా లు జలమయం కాగా చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కొత్తగూడ మండలం కొత్తపల్లి వద్ద గ్యాదె వాగు రోడ్డుపై నుంచి పారడం, గార్ల మండలకేంద్రానికి వెళ్లే పాకాల ఏరు కాజ్వేపై నుంచి ప్రవహిస్తుండడంతో పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్లోని మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, శివారులోని నిజాం చెరువు మత్తడి పోస్తోంది. కాటారం మండలం బొప్పారం, పోతుల్వాయి వాగులు పొంగడంతో పలు గ్రామాలుకు రాకపోకలు నిలిచిపోయాయి. మహాముత్తారం మండలంలో పెద్దవాగు రోడ్డుపై నుంచి పారుతుండడంతో అధికారులు ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి మేడారం, మహముత్తారం మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముండడంతో అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు, టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేసి అధికారయంత్రాంగాన్ని కలెక్టర్లు అప్రమత్తం చేశారు.
కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి
కాళేశ్వరం, జూలై 9 : జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద ఉదయం లక్ష క్యూసెక్కులు రాగా, ఆ తర్వాత వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాణహిత నది నుంచి వరద రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పుష్కర ఘాట్ వద్ద 8.90 మీటర్ల ఎత్తులో పారుతూ లక్ష్మీబరాజ్ వైపు నీరు పరుగులు తీస్తోంది. నది ప్రవాహం పెరగడంతో అధికారులు భక్తులను గోదావరిలోకి దిగకుండా అప్రమత్తం చేశారు.
లక్ష్మీ బరాజ్ 57 గేట్లు ఎత్తివేత
మహదేవపూర్, జూలై 9 : కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్కు వరద ఉధృతి భారీ స్థాయిలో పెరిగింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నది ద్వారా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. బరాజ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.32 టీఎంసీల నీరు ఉంది. శుక్రవారం 92,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా శనివారం 2,26,300 క్యూసెక్కులకు పెరిగింది. అవుట్ఫ్లో 4,00,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు డీఈ సురేశ్, ఏఈ షేక్వలీ తెలిపారు.