ఖిలావరంగల్, జూలై 9: జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం జిల్లాలో సగటు వర్షాపాతం 5.2 సెంటీ మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా చెన్నారావుపేట మండలంలో 10.1 సెంటీమీటర్లు, అత్యల్పంగా వరంగల్ మండలంలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు చేరుతున్నది. ఆదివారం కూడా వర్షం కురిస్తే చెరువులు, కుంటలు అలుగుపోసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నర్సంపేట/ఖానాపురం/దుగ్గొండి/సంగెం/గీసుగొండ/చెన్నారావుపేట: నర్సంపేటలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముసురుతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వాగులు, వంకల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం శనివారం 19.6 అడుగులకు చేరుకుంది. సరస్సులోకి 25 అడుగుల నీరు చేరితే పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. దుగ్గొండి మండలవ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ భూముల్లో వర్షపునీరు భారీగా నిలువడంతో చెరువులను తలపించాయి. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలకు చెరువులకు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగెం మండలంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఎల్గూర్చెరువుకు నీరు వస్తుండడంతో మత్య్సకారులు చేపలు పడుతున్నారు. మొండ్రాయి-మచ్చాపూర్ రోడ్డుపై గుంతలు పడడంతో తాత్కాలిక మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గీసుగొండ మండలవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రజలు ఇండ్లకే పరితమయ్యారు. వాగులు, వంకల్లోకి వరదనీరు చేరి ప్రవహిస్తున్నాయి. మండలంలోని చంద్రయ్యపల్లి లోలెవల్ వంతెనను ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్కుమార్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వంతెన వద్ద పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారన్నారు. ఆయన వెంట ఎంపీవో ప్రభాకర్, సర్పంచ్ ఆకుల స్రవంతి, గ్రామస్తులు ఉన్నారు. చెన్నారావుపేట మండలంలో రెండు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. కుంటలు, చెరువులు నిండుతున్నాయి. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ప్రజలు అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, గృహాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.