మునుగోడు ఉప ఎన్నికల్లో రథసారథులై కదనరంగాన దూకేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సమాయత్తమవుతున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అక్కడ ప్రచార బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సగటున రెండువేల మంది ఓటర్లకు ఒకరి చొప్పున సమన్వయం చేసుకోనున్నారు. ఇన్చార్జిలుగా నియమితులైనవారు శనివారం నుంచి తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారు. సుమారు 25రోజుల పాటు అక్కడే ఉండి గులాబీ సైనికులతో కలిసి విజయతీరాలకు చేరేందుకు సిద్ధమయ్యారు.
వరంగల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతల్లో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రెండు వేల మంది ఓటర్లకు ఒకరు చొప్పున ప్రజాప్రతినిధులకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. మున్సిపాలిటీ పరిధిలో రెండు వార్డులకు, గ్రామీణ ప్రాంతమైతే ఎంపీటీసీ నియోజకవర్గ పరిధికి ఇన్చార్జిలుగా ఉంటారు. ముఖ్యమైన ప్రజాప్రతినిధులతోపాటు వారి వెంట అసెంబ్లీ సెగ్మెంట్లోని కొందరు ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఉపఎన్నికలో ప్రచార ఇన్చార్జిలుగా నియమితులైన వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శనివారం నుంచి వీరంతా మునుగోడు సెగ్మెంట్లోని తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రచారంలో నిమగ్నం కానున్నారు.