గ్రేటర్లో అత్యాధునిక హంగులతో స్మార్ట్ బస్స్టేషన్ ఏర్పాటుకానున్నది. రూ.75 కోట్లతో రెండెకరాల 32 గుంటల విస్తీర్ణంలో 32 ప్లాట్ఫారాలతో నిర్మించేందుకు ‘కుడా’ ప్రతిపాదనలు పంపగా టీఎస్ఆర్టీసీ ఆమోదం తెలిపింది. కాజీపేట నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ వరకు నిర్మించబోయే నియో మెట్రోకు బస్స్టేషన్ను అనుసంధానం చేయనుండగా నిర్మాణ బాధ్యతలను యూఎంటీసీ అండ్ నాగ్పూర్ మెట్రో సంస్థకు అప్పగించనున్నారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్లో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎండీ వీసీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్, నెల్లికుదురు, అక్టోబర్ 14: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖతో రాష్ట్రవ్యాప్తంగా ‘తొలిమెట్టు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే-21(న్యాస్) ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో విద్యా ప్రమాణాలు లేవనేది వెల్లడైంది. దీంతో వారిలో సామర్థ్యాలను పెంచేందుకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7035 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వగా ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నది.
అభ్యసనా సామర్థ్యం పెంచే దిశగా..
విద్యార్థులు ధారాళంగా చదవడం, తప్పుల్లేకుండా రాయడం, గణిత సామర్థ్యం సాధించడం వంటి లక్ష్యాలతో ఈ తొలిమెట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుపరంగా బోధనతో పాటు ఈ అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు సమాంతరంగా ప్రణాళికాబద్దంగా కృషిచేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
రిసోర్స్పర్సన్లకు శిక్షణ పూర్తి
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)లు సంయుక్తంగా ఇప్పటికే జిల్లాల నుంచి రిసోర్స్పర్సన్లను ఎంపిక చేసింది. జూలై 19 నుంచి 21వరకు టీఎస్ఐఆర్డీలో శిక్షణ ఇచ్చింది. కార్యక్రమ అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారులకు, సమగ్ర శిక్షణ కో-ఆర్డినేటర్లకు రాష్ట్రస్థాయిలో జూలై 21న అవగాహన కల్పించారు. మండలాల నుంచి తెలుగు-1, గణితం-1, ఆంగ్లం-1, పరిసరాల విజ్ఞానం-1 సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులను సబ్జెక్టుకు ఒకరి చొప్పున మొత్తం నలుగురిని ఎంపిక చేసి వారికి జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో 304 ప్రాథమిక పాఠశాలలు(పీఎస్), 60 ప్రాథమికోన్నత పాఠశాలలు(యూపీఎస్)లు ఉన్నాయి. 980 మంది రిసోర్స్పర్సన్లు శిక్షణ పొందారు. హనుమకొండ జిల్లాలో (పీఎస్లు-304, యూపీఎస్లు-60) 980 మంది, వరంగల్ జిల్లాలో(పీఎస్లు-453, యూపీఎస్లు-67) 1637 మంది, జనగామ జిల్లాలో (పీఎస్లు-341, యూపీఎస్లు-64) 1104 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో (పీఎస్లు-319, యూపీఎస్లు-43) 849 మంది, ములుగు జిల్లాలో (పీఎస్లు-268, యూపీఎస్లు-45) 656 మంది మొత్తం 7035 మంది రిసోర్స్పర్సన్లు శిక్షణ పొందారు.
మూడు విడుతల్లో ఉపాధ్యాయులకు..
జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన రిసోర్సుపర్సన్లు జూలై 30 నుంచి మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులందరికీ మూడు విడుతల్లో శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు ఉన్నారు. నేటి నుంచి అన్ని పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తారు. పాఠశాల స్థాయిలో తొలిమెట్టు నిరంతరాయంగా కొనసాగిస్తారు.