సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. భూపాలపల్లి ఏరియాలో శుక్రవారం 27 మంది సింగరేణి కార్మిక వారసులు కారుణ్య నియామక పత్రాలను జీఎం బళ్లారి శ్రీనివాసరావు చేతులమీదుగా అందుకున్నారు. సీఎం కేసీఆర్ వల్లే తమకు ఈ ఉద్యోగాలు వచ్చాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.
భూపాలపల్లి, అక్టోబర్ 14 : సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య’ నియామకాలు కాంతులు నింపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పోయిన తండ్రీకొడుకుల ఉద్యోగాలు.. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో అందుతున్నాయి. అందుతూనే ఉన్నాయి. దీంతో నల్లసూర్యుల ఇండ్లల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలో శుక్రవారం 27 మందికి కారుణ్య నియామకాలు అందాయి. స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలో జీఎం బళ్లారి శ్రీనివాసరావు యువకులకు అందజేశారు. లక్ష్యాలను ఎంచుకొని, లక్ష్య సాధన కోసం పట్టుదలతో పనిచేయాలని, కష్టపడితేనే భవిష్యత్ బాగుంటుందని పేర్కొన్నారు.
చాలా సంతోషంగా ఉంది..
సింగరేణిలో ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నా నేను డిగ్రీ చదివాను. సీఎం కేసీఆర్ సార్ సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రవేశపెట్టడం వల్లేనే నాలాంటి ఎందరో యువతులకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ సర్కు ప్రత్యేక కృతజ్ఙతలు మా నాన్న ఐలబోయిన శంకర్ భూపాలపల్లి ఏరియా కేటీకే 8వ గనిలో ఎస్డీఎల్ ఆపరేటర్గా పనిచేస్తూ మెడికల్ అన్ఫిట్ అయ్యారు. ఉద్యోగపరంగా ఎంతో కష్టపడి పని చేశారు. నేను పట్టుదలతో పనిచేసి మా నాన్న కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తా .
– ఐలబోయిన నవ్యశ్రీ, భూపాలపల్లి ఏరియా
ఉద్యోగాలు వస్తాయనుకోలేదు..
సింగరేణిలో పోయిన తండ్రీకొడుకుల ఉద్యోగాలు మళ్లీ వస్తాయని కళలో కూడా అనుకోలేదు. కారుణ్య నియామక రూపంలో మళ్లీ తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ సర్కు కృతజ్ఙతలు. నేను ఎంబీఏ చదివాను. కేఎన్ఆర్ నిర్మాణ సంస్థలో మల్లన్న సాగర్ వద్ద (సిద్దిపేట) హెచ్ఆర్ డిపార్డ్మెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నా. ఎస్సై ఉద్యోగ పరీక్ష రాశాను రాలేదు. వివాహం అయ్యింది. ఈ తరుణంలో మా నాన్న కేటీకే 5వ గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేసి మెడికల్ అన్ఫిట్ అయ్యారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.
– సాదుల అరుణ్నెహ్రూ, భూపాలపల్లి ఏరియా
మెరుగైన సౌకర్యాలు
దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల కంటే సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వసతులు, సౌకర్యాలున్నాయి. సీఎం కేసీఆర్ పట్టుబట్టి కారుణ్య నియామకాలు తీసుకురావడం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. నేను డిగ్రీ చదివాను. మా నాన్న ఓదెలు.. భూపాలపల్లి ఏరియా కేటీకే-5వ గని కన్వేయర్ బెల్ట్ ఆపరేటర్గా పనిచేసేవారు. మెడికల్ అన్ఫిట్ అవడంతో నాకు ఉద్యోగం వచ్చింది. మా నాన్న ఉద్యోగం నిలబెట్టుకున్నట్లే నేను క్రమశిక్షణతో కష్టపడుతా. సంస్థ తమ ఉద్యోగులను క్రీడలు, కళారంగాల్లో ప్రోత్సహిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
– కూషన హరికృష్ణ, భూపాలపల్లి ఏరియా
ఆర్థిక దన్నుగా నిలుస్తుంది.
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే ఈ రోజు మా నాన్న ఉద్యోగం నాకు వచ్చింది. నేను ఎమ్కాం చేశాను. చాలీచాలని వేతనంతో పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ వస్తున్నా. ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చిన ఉద్యోగం ద్వారా మా కుటుంబానికి ఎంతగానో ఆర్థిక దన్నుగా నిలుస్తుంది. సమైక్య రాష్ట్రంలో పోయిన తండ్రీకొడుకుల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కారుణ్య నియామకాల రూపంలో రావడం చాలా ఆనందంగా ఉంది.
– వొద్ది రాజ్కుమార్, భూపాలపల్లి ఏరియా
ప్రభుత్వం దయవల్లే..
తెలంగాణ ప్రభుత్వం దయవల్లే తల్లిలాంటి సింగరేణిలో నాకు ఉద్యోగం వచ్చింది. అదృష్టంగా భావిస్తున్న. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఉద్యోగ భద్రత ఉండదు. సింగరేణిలో వాటితో పాటు కుటుంబ సభ్యులతో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. మా నాన్న వెంకటస్వామి భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్షాప్లో టెండాల్గా పనిచేస్తూ మెడికల్ అన్ఫిట్ అయ్యారు. కష్టపడి పనిచేసి మా ముందు తరానికి సహకారిగా నిలుస్తా. – పోతుల దివ్యజ్యోతి, భూపాలపల్లి ఏరియా