కేసీఆర్తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారు. సోమవారం ఆమె మరిపెడ మున్సిపల్ కేంద్రంలో నూతన ఆసరా పింఛన్దారులకు మంజూరు పత్రాలు, ఐడీకార్డులు ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం జిల్లాలో కేంద్రమంత్రి పర్యటనపై ఫైర్ అయ్యారు. కొత్త కలెక్టర్ భవనం, మెడికల్ నిర్మాణ పనులు, గ్రంథాలయం, ఇంటింటికీ అందుతున్న భగీరథ నీళ్లు, నిరంతర కరంటు, పచ్చని పైర్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కళ్లముందే ఇంత ప్రగతి కనిపిస్తున్నా చూడలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రమంత్రులకు రాష్ట్రంపై అభిమానం ఉంటే తక్షణమే విభజన చట్టంలోని హామీలపై స్పందించి జిల్లాలో పర్యటించాలన్నారు.
మరిపెడ, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ పల్లెలు, పట్టణాలు ప్రగతిపథం లో నడుస్తుండగా, ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాజకీయ పబ్బం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నదని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవా రం ఆమె మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, భార్గవి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి నూతన ఆసరా పింఛన్దారులకు మంజూరు పత్రాలు, ఐడీ కార్డు లు అందజేశారు. అనంతరం ఎంపీ కవిత సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కవిత మాట్లాడుతూ.. జిల్లా లో పర్యటిస్తున్న కేంద్రమంత్రికి కొత్త కలెక్టరేట్ భవనం, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మా ణ పనులు, జిల్లా కేంద్రంలో నిర్మించిన గ్రంథాలయం, పచ్చని పంట చేలు, కంటిరెప్ప వేసినంత సేపు కూడా పోని కరంటు, పేదలకు అత్యాధునిక వసతులతో అందుతున్న వైద్యం, ఇంటింటికీ శుద్ధి చేసిన భగీరథ జలాలు, కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య, 57ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ల పంపిణీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కళ్లముందే ఇంత ప్రగతి కనిపిస్తున్నా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. సాగు, వ్యాపార, వాణిజ్య రంగాలకు నిరంతరం మెరుగైన విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గిరిజన తండాలు పంచాయతీలుగా మారి ప్రగతిపథంలో నడుస్తున్నా బీజేపీ పాలకులు చూడలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సుభిక్ష పాలన అందిస్తున్న ఉద్యమ నేత కేసీఆర్తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లే హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల కొమ్ముకాస్తూ పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్, ఇంధన ధరల ప్రభావం నిత్యావసర సరుకులపై పడి బడులు జీవులు బతకడం కష్టంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులకు తెలంగాణపై అంత అభిమానం ఉంటే విభజన హామీలపై స్పందించాలన్నారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విన్నవించినా కనీస స్పందన లేదన్నారు. కేంద్రమంత్రులు వీటిపై సమాధానం చెప్పాకే జిల్లాల్లో పర్యటించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా.. అంటూ కవిత కేంద్ర మంత్రులను సూటిగా ప్రశ్నించారు.
ఎమ్మె ల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. ఇంటింటికీ సంక్షేమం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందిపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదన్నారు. గాంధీ జీ కలలుగన్న గ్రామీణ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ నిత్యం కష్టపడి చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో పింఛను రూ.600 మాత్రమే ఉండగా, తెలంగాణలో దివ్యాంగులకు రూ.3వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2వేల చొప్పున పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకంతో అణగారిన వర్గాలకు అండగా నిలిచినట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా దసరా నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ.3 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గుడిపూడి నవీన్రావు, అచ్యుత్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూరాకుమారి, ఎంపీపీ గుగులోత్ అరుణ, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, వైస్ ఎంపీపీ అశోక్రెడ్డి, వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాణిక్యం, సుజల, మాచర్ల స్రవంతి, పరశురాములు, మైనార్టీ సెల్ నాయకుడు ఆయూబ్ పాషా, దిగజర్ల ముఖేశ్, అజ్మీరారెడ్డి, జాటోత్ బాలజీ, సయ్యద్ లతీఫ్, వెంకన్న, రాంబాబునాయక్ పాల్గొన్నారు.