‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. కేంద్రం నుంచి 53 అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయండి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంసించారు. శుక్రవారం హసన్పర్తిలోని భగీరథ భవన్లో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్లతో కలిసి ఇటీవల అవార్డులు అందుకున్న వాటర్గ్రిడ్ ఇంజినీర్లకు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. మన పథకాలను మోదీ సర్కారు మెచ్చుకొని అవార్డులు ఇవ్వడం తప్ప నిధులివ్వడం లేదని.. రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులను పట్టించుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు.
హనుమకొండ సబర్బన్/హసన్పర్తి, అక్టోబర్ 14: ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూపొందించి నిర్మించిన మిషన్ భగీరథ పథకాన్ని అద్భుత పథకంగా కీర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కేవలం అవార్డులిచ్చి చేతులు దులుపుకున్నదే తప్ప పైసలు మాత్రం ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, తాగునీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు దక్కిన నేఫథ్యంలో పలువురు ఇంజినీర్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం హసన్పర్తి పరిధిలోని మిషన్ భగీరథ భవన్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ గొప్పతనాన్ని నీతి ఆయోగ్ సంస్థ గుర్తించి రూ.19వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కేవలం రాష్ట్ర నిధులతోనే పూర్తిచేసి ఈ రోజు నల్లాల ద్వారా ఇంటింటికీ పూర్తిస్థాయిలో శుద్ధ జలాన్ని అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. దీనికి ఇంజినీర్ల కృషి అమోఘమని కీర్తించారు. ఇప్పుడు వంద శాతం పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ నీటిని అందిస్తున్నామన్న మంత్రి.. మన మిషన్ భగీరథను పలు రాష్ర్టాల్లో ఇతర పేర్లతో అమలు చేస్తున్నారని తెలిపారు. కొన్ని రాష్ర్టాలు జల్ జీవన్ మిషన్ పేరుతో తాగునీటిని సరఫరా చేస్తున్నప్పటికీ బోర్లు, బావుల నీటిని మాత్రమే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే వర్షపు భూ ఉపరితల నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అనేక జిల్లాల్లో గుక్కెడు నీటి కోసం జనం గోస పడేవారని గుర్తు చేశారు. ప్రతి మనిషికి శుద్ధి చేసిన పరిశుభ్రమైన నీటిని అందించడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. గతంలో గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన బావులు, బోర్ల మోటర్లు, స్టార్టర్ల రిపేర్లకే స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం సరిపోయేదని, ఇతర పనులు చేసేందుకు సమయం కూడా ఉండేది కాదన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీలో అనేక సార్లు తాగునీటి గురించి ప్రశ్నించానని, ఎన్ని సార్లు అడిగినా కేసీఆర్ మాత్రం ఓపికగా మరికొంత కాలం వేచి ఉండాలని చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
తాను టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మిషన్ భగీరథ పథకమే ముఖ్యమైనదని చెప్పారు. ఇప్పుడు ఇంత గొప్ప శాఖకు తాను ఇన్చార్జిగా ఉండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ మిషన్ భగీరథ పథకం అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్మితా సబర్వాల్ చాలా కష్టపడ్డారని కొనియాడారు. దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ర్టానికి 53 అవార్డులు వచ్చాయని.. స్వీకరించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. మిషన్ భగీరథ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మన మిషన్ భగీరథ పథకానికి అవార్డులు రావడంలో అందరి కృషి దాగి ఉందన్నారు. అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న అధికారులు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇంత గొప్ప శాఖకు తాను ఇన్చార్జిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి ముందు మంత్రి ఎర్రబెల్లి మిషన్ భగీరథ భవనాన్ని, నీటి శుద్ధీకరణ, నాణ్యతా ప్రమాణాల పరీక్షలు, నీటి పంపిణీతో పాటు ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అవార్డులు పొందిన అధికారులకు ప్రత్యేక జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ఎస్సీలు మల్లేశం, రాములు పాల్గొన్నారు.
మానుకోటకు అవార్డుల పంట
తొర్రూరు, అక్టోబర్ 14 : మిషన్ భగీరథలో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా ఇంజినీర్లు అవార్డులను కైవసం చేసుకున్నారు. మరిపెడ(మాదిరిపురం) డబ్ల్యూటీపీ నుంచి రోజువారీగా సమర్థవంతంగా బల్ వాటర్ను సరఫరా చేయిస్తున్న జిల్లా గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏ సురేందర్, ప్లాంట్లో వ్యర్థనీటి శుద్ధీకరణకు సంబంధించి ఏఈఈ సీ నిశాంక్, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిషరించిన ప్రస్తుత నర్సంపేట డీఈఈ ఎం ప్రదీప్కుమార్, హరితహారం లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేయించిన మరిపెడ గ్రిడ్ డీఈఈ వీ స్వామిదాస్, ఇంట్రా విభాగంలో నివేదికలను సమర్థవంతంగా పూర్తి చేసిన చిన్నగూడూరు, గంగారం మండలాల ఏఈఈలు ఎం విష్ణువర్ధన్, సీహెచ్ దినేశ్కు అవార్డులు దక్కగా ఉన్నతాధికారులు అభినందించారు. మరిపెడ డబ్ల్యూటీపీ నుంచి ప్రస్తుతం ప్రతి రోజూ 170 ఎంఎల్డీల శుద్ధి చేసిన నీటిని మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాల పరిధిలో ఉన్న 1683 ఆవాసాలకు సరఫరా చేస్తున్నారు.