హనుమకొండ, 27: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంగళవారం టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి హనుమకొండలోని ఆర్ అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని, మరోసారి విషం కక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన మూడు అంశాల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటని చీఫ్విప్ తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్నారని, గిరిజన యూనివర్సిటీ అడ్రస్ లేకుండా పోయిందని, తాజాగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టలేమని సిగ్గులేకుండా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు నాటి ఉద్యమనేత కేసీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, ఆ సమయంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి రాజీనామా చేయకుండా విదేశాలకు పారిపోయాడన్నారు. అదేవిధంగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు సైతం అసెంబ్లీ నుంచి జారిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని చెప్పారు.
బీజేపీ నాయకుల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వారానికో కేంద్ర మంత్రి వస్తున్నా ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు ఇప్పుడు ఇండియా గేట్ దగ్గర బతుకమ్మ ఆడిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో లాథూర్కు ఇచ్చారన్నారు. ఆటోడ్రైవర్లను రైల్వేస్టేషన్ల వద్ద ఇబ్బందులకు గురిచేసి పన్నులు వసూలు చేయడం బాధాకరం అన్నారు. పాలు అమ్ముకొనే వారి నుంచి జీఎస్టీ వసూలు చేస్తోందన్నారు. అలాగే, లాభాలు తెచ్చే ఎల్ఐసీ వంటి సంస్థలను అమ్ముతున్నారన్నారు. దేశంలోని రైతులు, యువత, కార్మికులు, ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. విభజన హామీలోని కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ సాధించే వరకూ ఓరుగల్లు నుంచి మరో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. దసరా లోపే కార్యాచరణ ప్రకటిస్తామని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు.
కిషన్రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్యే అరూరి రమేశ్
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హక్కు అని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. బయ్యారంలోని ఉక్కు నాణ్యమైందేనని సర్వేలు చెప్పాయన్నారు. సర్వేలు చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పొందుపరిచారని గుర్తుచేశారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్తోనే అమలవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు పాల్గొన్నారు.