హనుమకొండ, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఎమ్మెల్యే అరూరి రమేశ్ నివాసంలో దాస్యం విలేకరులతో మాట్లాడారు. మే 6న ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ సందర్భంగా గురువారం హనుమకొండలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో వణుకు పుడుతున్నదన్నారు. రేవంతర్రెడ్డి వరంగల్కు వచ్చి రైతు సంఘర్షణ సభ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే రేవంత్రెడ్డి విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న క్రమంలో కాంగ్రెస్లో వర్గపోరు ప్రారంభమైందన్నారు.
రాహుల్గాంధీకి దేశ సరిహద్దులు, ప్రజాసమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ప్రతినిధుల సభ విజయవంతమైందనే అక్కసు, అసూయతో అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే సమస్యే లేదు.. ఖబడ్దార్ రేవంత్రెడ్డి అని హెచ్చరించారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే నైతిక హక్కు రేవంత్రెడ్డికి లేదన్నారు. బ్యాండ్ బాజా రేవంత్రెడ్డి బ్యాచ్ ఖబడ్దార్ అని అరూరి హెచ్చరించారు. సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కార్పొరేటర్ సునీల్, శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.