నర్సంపేట, అక్టోబర్ 23: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నర్సంపేటలో పోలీసు బ్యాండ్ బృందం ఆదివారం ప్రదర్శనలిచ్చింది. అంబేద్కర్ సెంటర్తోపాటు దారి పొడవునా పోలీసు బ్యాండ్ కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. హనుమకొండ హెడ్క్వార్టర్ నుంచి పోలీసు బ్యాండ్ బృందం నర్సంపేటకు వచ్చింది. ఈ సందర్భంగా వారి ప్రదర్శనను తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఎస్సై రవీందర్, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
సంగెం: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గవిచర్లలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్కానిస్టేబుల్ బుట్టి సంతోష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేవని ప్రజాప్రతినిధులు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దొనికెల రమ-శ్రీనివాస్, ఎంపీటీసీ గూడ సంపత్రెడ్డి, ఉపసర్పంచ్ యాకయ్య, సతీశ్, కరుణాకర్, కరుణాకర్, నవీన్రెడ్డి, జగదీశ్, దేవేందర్, రాజు, దయాకర్, చిన్నరాజు, రాజేశ్, మహేశ్, శరత్, శ్రీనివాస్, రాజ్కుమార్, విజేందర్, మహేందర్, పవన్ పాల్గొన్నారు.
మట్టెవాడ పోలీస్స్టేషన్లో రక్తదాన శిబిరం
పోచమ్మమైదాన్(మట్టెవాడ): పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మట్టెవాడ పోలీస్స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. అనంతరం 15 సార్లు రక్తదానం చేసిన మడిపెల్లి సుశీల్గౌడ్కు సర్టిఫికెట్ అందించారు. శిబిరంలో మట్టెవాడ, ఇంతెజార్గంజ్, మిల్స్కాలనీ సిబ్బంది పాల్గొన్నారు. 95 యూనిట్ల రక్తాన్ని బ్లడ్బ్యాంక్కు అందించినట్లు ఏసీపీ తెలిపారు. ఎంజీఎం దవాఖాన బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.