‘మాలాంటి పేదోళ్లకు కడుపునిండా తిండి దొరకాల్నంటే సీఎం కేసీఆర్లాంటోడు దేశ పాలకుడు కావాలె. ఆయన కష్టం విలువ తెలిసినోడు. మంచిగ ఆలోచిస్తడు.. అసోంటోడు దేశ రాజకీయాల్లోకి వస్తే మంచి పనులు చేస్తడు.. పేదల బతుకులను బాగుచేస్తడు’ అంటూ బీడీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపారని, దేశమంతటా ఉన్న పేదల కష్టాలు తొలగిపోవాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని చెబుతున్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బాగు కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 30
అందరికీ ‘ఆసరా’ అయితడు..
కొత్తగూడ : కేసీఆర్ సర్కార్ అచ్చినంకనే బీడీకార్మికులకు పింఛన్లు వచ్చినయ్. ఇదివరకున్న ప్రభుత్వాలు మమ్ముల అస్సలు పట్టించుకోలే. పింఛన్ వచ్చుడు మస్తు కష్టమయ్యేది. అసోంటిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక అందరికీ ఆసరా పింఛన్లు వచ్చినయ్. ఇంకా వస్తున్నయ్. పేదోళ్ల కష్టాలు తెలుసుకునుడే కాదు.. వాళ్లకింత ఆసరా అయ్యేది ఎవరంటే అది కేసీఆరే. పింఛన్ ఇచ్చి మాకు భరోసా ఇచ్చిండు. అందరి కోసం ఆలోచించే కేసీఆర్ దేశంల ఉంటే మన తెలంగాణ లెక్క అన్ని రాష్ర్టాల పేదలకు ఆసరా అయితడు. దేశం కూడా మంచిగుంటది.
– దేవుళ్లపల్లి హేమలత, కొత్తగూడ
‘సంక్షేమం’ ఇంటికే వస్తది..
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 30 : బీడీ కార్మికులు ఇదివరకటి కంటే ఇప్పడు ఎంతో సంతోషంగా బతుకుతున్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మా అందరికీ అందుతున్నందున అందరం చాలా ఆనందంగా ఉన్నాం. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మాకు వస్తున్నందున సంతోషంగా ఉన్నాం. బీడీ కార్మికులు రోడ్డున పడుకుండా మాకు చేతినిండా పని కల్పిస్తూ ఆదుకుంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, చీరెల పంపిణీ, కేసీఆర్ కిట్స్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో మాదిరిగా అధికారుల చుట్టూ తిరుగకుండా మా వద్దకు సంక్షేమ పథకాలు వచ్చాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు.
– బెల్లంకొండ మంగ, బీడీ కార్మికురాలు
కార్మిక వర్గాలకు మేలైతది..
కాశీబుగ్గ, సెప్టెంబర్ 30 : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కార్మిక వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుంది. నిరుపేద, మధ్యతరగతి కార్మిక వర్గాలు అన్ని విధాలా బాగుపడుతారు. తెలంగాణ మాదిరిగా అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. గత ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో అన్ని కార్మిక వర్గాలకు న్యాయం జరిగింది. అన్ని రంగాల్లో కార్మికులకు పెద్దపీట వేసే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉండాల్సిందే.
– సునీత, బీడీ కార్మికురాలు, వరంగల్
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి పోవాలె..
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 30 : ఇవాళ దేశంలోని నాలాంటి పేదలకు పట్టెడన్నం దొరకాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవాలి. ఆయన అక్కడ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది. మంచి మనసున్న నాయకుడు, పేదల కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్. కాళ్లురెక్కల్నే నమ్ముకొని బీడీలు చుట్టుకుంటున్న మా బతుకులకు దీపం అయ్యిండు. బీడీ కార్మికుల పింఛన్ కింద ప్రతి నెలా రూ.2016 ఇస్తుండు. మా బతుకుల గురించి ఇంత మంచిగా ఆలోచించే వ్యక్తి దేశాన్నేలితే ఇంకా ఎన్నో గొప్ప పనులు చేస్తడు. అందుకే ప్రజల నాయకుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి కచ్చితంగా పోవాలె.
– కొండ చంద్రకళ, బీడీ కార్మికురాలు, వీవర్స్ కాలనీ, జనగామ
అందరికీ న్యాయం జరుగుతుంది
ములుగు రూరల్, సెప్టెంబర్ 30 : కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తున్నడని పేపర్లలో వచ్చింది చూసి తెలుసుకున్నా. రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ ఎనిమిదేళ్లలో ఎన్నో పథకాలు తెచ్చారు. బీడీ కార్మికులకు కూడా నెలనెలా పింఛన్లు అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తూ మా కుటుంబాలకు ఆసరా అవుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు మాకు అందిస్తూ కష్టాలు తీర్చుతున్నారు. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కూడా వచ్చింది. చాలా సంబురం అయింది. బిడ్డకు పెండ్లి చేసే సమయంలో తల్లిదండ్రులకు ప్రతి రూపాయి విలువైనదే. అందరి సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలువాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఇలా మంచి పనులు చేస్తున్నారు. ఆయన ముందుచూపు వల్లే అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ అయింది. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని మా గట్టి నమ్మకం.
– గుత్తికొండ సంధ్యారాణి