దామెర, సెప్టెంబర్ 30 : అర్హులందరికీ ఆసరా ఫించన్లు అందజేస్తామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊరుగొండలో లబ్ధిదారులకు శుక్రవారం ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. అంతకు ముందు దుర్గంపేటలోని రూ.25 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ భవనం కోసం అదనంగా మరో రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కమ్యూనిటీ భవన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ డీఈని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, సర్పంచ్ గోగుల సత్యనారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు సిలివేరు నర్సయ్య, ఉపసర్పంచ్ విద్యాసాగర్, జన్ను సాంబయ్య పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
పరకాల : ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇటీవల మృతి చెందిన సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పండుగ ఎల్లస్వామి కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షల విలువ చేసే ప్రమాదబీమా చెక్కును హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్లో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారని అన్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు పార్టీ రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులే టీఆర్ఎస్కు బలమని, వారి కృషితోనే టీఆర్ఎస్కు రాష్ట్రం లో ఎదురులేదని పేర్కొన్నారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామియాదవ్, ఎల్లస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదే విధంగా గీసుగొండ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.