హనుమకొండ/కరీమాబాద్/రఘునాథపల్లి, జూన్ 22: జూలై 7నుంచి ఏడు రోజుల పాటు కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ సుధారాణితో కలిసి హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వరంగల్పై సీఎం కేసీఆర్కు ప్రేమ ఎక్కువ అని, హైదరాబాద్ స్థాయిలో ఉమ్మడి వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే వరంగల్కు పెద్ద పరిశ్రమలు వచ్చేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారన్నారు. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయను ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామని చెప్పారు. త్వరలోనే జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్విప్ వినయ్భాస్కర్, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమీక్షించిన అనంతరం ఉత్సవాల షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్పారు. కళాకారులతో పేరిణి శివతాండవం, వివిధ కళారూప ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ వరకు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తామన్నారు. కాకతీయ ఉత్సవాలకు రూ.100 కోట్లు, రామప్ప అభివృద్ధికి రూ.500 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
కోట, అగ్గలయ్యగుట్ట సందర్శన
వరంగల్ కోటను చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్యే నరేందర్, మేయర్ సుధారాణితో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ సందర్శించారు. కోటకు పూర్వవైభవం తెచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. పద్మాక్షికాలనీలోని అగ్గలయ్య గుట్టను పరిశీలించి గుట్ట, జైన్ పార్కు ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, డాక్టర్ బీ గోపి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, నగర కమిషనర్ ప్రావీణ్య, కుడా అధికారి అజిత్రెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ్ణ, కార్పొరేటర్లు పోశాల పద్మ, మరుపల్ల రవి, మాజీ కార్పొరేటర్ భైరబోయిన దామోదర్, నాయకులు పోశాల స్వామి, పొగాకు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ఎక్సైజ్ అధికారులు పనిచేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. చీఫ్ విప్ దాస్యంతో కలిసి హరిత హోటల్లో ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు. ఎన్డీపీఎల్, మద్యం, గంజాయి, గుడుంబా తయారు, రవాణా, అమ్మకాలు చేస్తున్నవారిపై నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక ప్రాజెక్టులపై సమీక్షించి కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతం చేయాలన్నారు. హనుమకొండ, వరంగల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అంశాలపై చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్యే నరేందర్ వివరించారు.
7 కాకతీయుల సెంటిమెంట్ :చీఫ్ విప్ దాస్యం
కాకతీయులకు నంబర్ 7 సెంటిమెంట్ అని, ఇదే సెంటిమెంట్తో ఏడు కట్టడాలు, ఏడు కోటలు కట్టారని అందుకే ఏడో నెల ఏడో తేదీ నుంచి ఏడు రోజుల పాటు కాకతీయుల ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ప్రపంచంలో ఎకడా లేని విధంగా కాకతీయులు 46వేల గొలుసుకట్టు చెరువులు నిర్మించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటేలా ఉత్సవాలు నిర్వహించాలని నాటి ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదన్నారు. కాకతీయు చరిత్రను ప్రపంచానికి చాటేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఉత్సవాలకు బస్తర్లో ఉన్న కాకతీయల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
బాధితులకు ఇండ్ల స్థలాలు
ఖిలాషాపురంలోని సర్దార్ సర్వాయి పాపన్న కోటను ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ సందర్శించారు. కోట పునరుద్ధరణ పనులను పరిశీలించారు. బస్టాండ్ సర్వాయి పాపన్న, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వీరుల చరితను భావితరాలకు అందించాలనే తపనతోనే సీఎం కేసీఆర్ సర్వాయి పాపన్నకోట పునరుద్ధరణకు మొదటి విడత రూ.1.26 కోట్లు, రెండో విడతగా రూ.80లక్షలు మంజూరు చేశారని చెప్పారు. గత వానకాలంలో కోట పైభాగం కూలి కింద ఉన్న ఇండ్లు కూలిపోగా వారంలోగా బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు. స్థలం వద్దనుకుంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కోట పనులను పాపన్న జయంతిలోగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా తాటికొండలోని పాపన్నకోటను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని మంత్రిని ఎమ్మెల్యే రాజయ్య కోరగా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ కలెక్టర్ శివలింగయ్య, ఆర్డీవో మధుమోహన్, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, పురావాస్తు శాఖ ఏడీ నర్సింగ్ నాయక్, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, తహసీల్దార్ అన్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వారాల రమేశ్యాదవ్, కార్యదర్శి ముసిపట్ల విజయ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, ఎం సునీత తదితరులున్నారు.