క్రాప్ బుకింగ్లో జిల్లాకు రాష్ట్రంలో నంబర్ వన్ స్థానం దక్కింది. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాల నమోదులో వరంగల్ ప్రథమస్థానంలో నిలిచింది. కొద్ది రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు వానకాలం పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరిస్తున్నారు. ఈ సారి అంచనాకు మించి పత్తి, వరి సాగు చేసినట్లు గుర్తించారు. జిల్లాలో 3,54,664 మంది రైతులు 2,72,426 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇప్పటికే 2,28,398 ఎకరాల పంట క్షేత్రాలను సందర్శించిన అధికారులు 1,86,448 ఎకరాల్లోని పంటల వివరాల నమోదు పూర్తి చేశారు. సర్వే నంబర్ వారీగా సాగు వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపనుండగా, క్రాప్ బుకింగ్ నివేదికతో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది.
వరంగల్, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : వానకాలం పంటల వివరాల నమోదులో జిల్లా రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో నిలిచింది. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటి వరకు 2,28,393 మంది రైతుల పంట క్షేత్రాలను సందర్శించారు. 1,86,448 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేసినట్లు గుర్తించారు. కచ్చితత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా వానకాలం, యాసంగిలో సర్వే నంబర్ వారీగా క్రాప్ బుకింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇటీవల వ్యవసాయ శాఖ వానకాలం క్రాప్ బుకింగ్ చేపట్టింది. ఆయా క్లస్టర్ల పరిధిలో రైతులు సాగు చేసిన పంటలను వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లు క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వే నంబర్ వారీగా వివరాలను నమోదు చేస్తున్నారు.
వ్యవసాయశాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 3,54,664 మంది రైతులకు వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో 2,72,426 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేశారు. క్రాప్ బుకింగ్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు 2,28,393 మంది రైతుల పంట క్షేత్రాలను విజిట్ చేశారు. 1,86,448 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేశారు. ఇప్పటికే పత్తి, మక్కజొన్న, వేరుశనగ, పెసర, వరి, సోయాబిన్ తదితర పంటల సాగు పూర్తికాగా మిర్చి నారు నాటడం ఇంకా కొనసాగుతున్నట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖ మండల అధికారు(ఎంఏవో)లు, అసిస్టెంట్ డైరెక్టర్ల్(ఏడీఏ)తో పాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) ఉషాదయాళ్ కూడా పంటలను సందర్శిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో జిల్లాలో వానకాలం క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వానకాలం క్రాప్ బుకింగ్లో రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వంతో పాటు కలెక్టర్ బీ గోపి ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉన్నది. సిద్దిపేట, పెద్దపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలు మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడో స్థానంలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అట్టడుగున ఉన్నది. మండలాల వారీగా చూస్తే చెన్నారావుపేట మండలం నంబర్ వన్ స్థానంలో ఉంది. నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, వరంగల్, రాయపర్తి, వర్ధన్నపేట, ఖిలావరంగల్, సంగెం, ఖానాపురం, దుగ్గొండి, గీసుగొండ, నల్లబెల్లి వరుసగా రెండు నుంచి పదమూడో స్థానంలో ఉన్నాయి. క్రాప్ బుకింగ్లో అట్టడుగున ఉన్న నల్లబెల్లిపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
2.99 లక్షల ఎకరాల్లో సాగు..
ప్రస్తుత వానకాలం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారుల అంచనాకు మించి రైతులు పంటలను సాగు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పత్తి, వరి పంటల సాగు అంచనాను మించింది. జిల్లాలో రైతులు సుమారు 3,08,473 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రధాన పంటలైన పత్తి 1,13,532, వరి 1,31,817, మక్కజొన్న 21,932, వేరుశనగ, 5,027, మిరప 16,373, పసుపు 5,672, కంది 2,000, ఇతర పంటలు 12,120 ఎకరాల్లో సాగు చేయవచ్చని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం క్లస్టర్ వారీగా పంటల సాగు వివరాలను ప్రాథమికంగా సేకరించారు. పత్తి, వరి, మక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను సాగు చేయడం పూర్తయింది. కేవలం మిరప నాటు ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు రైతులు 2,98,978 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. పంట వారీగా వీటి విస్తీర్ణం పరిశీలిస్తే పత్తి 1,28,201 ఎకరాల్లో, వరి 1,35,255, మక్కజొన్న 12,282, వేరుశనగ 3,509, పసుపు 2,653 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. మిరప పంటను మాత్రం ఇప్పటి వరకు 5,145 ఎకరాల్లో సాగు చేశారని, ఇంకా నాట్లు కొనసాగుతున్నందున విస్తీర్ణం పదిహేను వేల ఎకరాలు దాటవచ్చని భావిస్తున్నారు. జిల్లాలో పంటల సాగు మొత్తం విస్తీర్ణంతో పాటు పత్తి, వరి పంట సాగు విస్తీర్ణం అంచనాకు మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీరు అందుబాటులోకి రావడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది.