హనుమకొండ : మహిళా శిశు సంక్షేమంపై దృష్టి సారించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 130 అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్స్ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి లబ్ధిదారులకు అందాల్సిన సేవలను అందించాలని సూచించారు.
తమ తమ విధుల్లో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ హన్మకొండ ప్రాజెక్ట్ పరిధిలో 270 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 130 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 116 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నామని, 14 రెంట్ ఫ్రీ బిల్డింగ్లలో కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు స్థలం ఉన్నట్లైతే డీఈవోతో మాట్లాడి పక్కా భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హామీ ఇచ్చారు. సమావేశాలు నిర్వహించుకొనుటకు హాల్ కావాలని అంగన్వాడీ టీచర్ల కోరిక మేరకు ప్రతి నెల అంబేద్కర్ భవన్లో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటాన ని ఆయన అన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ సీడిపివో మధురిమ, సూపర్ వైజర్లు, అగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.